జిల్లాల అధ్యక్ష పదవులు రద్దు.. జగన్ కొత్త వ్యూహం
- జిల్లాల అధ్యక్ష పదవులను తొలగించిన జగన్
- పార్లమెంట్ నియోజకవర్గాలకు అధ్యక్షుల నియామకం
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి.. ఎన్నికల వ్యూహం అదిరింది. వచ్చే నెల నవంబర్ 6 నుంచి జగన్.. ‘ ప్రజా సంకల్ప యాత్ర’ పేరిట పాదయాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రను విజయవంతం చేసేందుకు జగన్.. పక్కా ప్రణాళికతో ముందుకు దూసుకువెళుతున్నారు.
ఇందులో భాగంగానే జిల్లా అధ్యక్ష పదవులను జగన్ తొలగించారు. ఇప్పటి వరకు జిల్లాకో అధ్యక్షుడు చొప్పున 13మంది అధ్యక్షులు ఉండేవారు. అయితే.. ఇప్పుడు ఆ అధ్యక్ష పదవిని తీసేసి ఒక్కో పార్లమెంటు నియోజకవర్గానికి ఒక అధ్యక్షుడిని నియమించారు. అంటే పార్టీ బాధ్యతలను ఒక జిల్లాలో ఇద్దరు నేతలు సమన్వయంతో నిర్వహిస్తారు. అంతేకాకుండా ప్రతి రెండు జిల్లాలకు ఒక ప్రత్యేక ఇంఛార్జ్ ని కూడా నియమించాడు.
తమ పార్టీని ప్రజల్లోకి మరింతగా చేరువ చేసేందుకు జగన్ ఈనిర్ణయం తీసుకున్నారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పార్టీ నేతలు హర్షిస్తున్నారు. నేతలు, శ్రేణుల మధ్య సమన్వయం కోసం జగన్.. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక అధ్యక్షుడిని నియమించినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే.. ఈ నియోజకవర్గ అధ్యక్షులను కేవలం పాదయాత్ర వరకు మాత్రమేనా లేదా ఎన్నికల వరకూ కొనసాగిస్తారా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.