స్టేడియంలోకి పాములను వదిలిపెడతాం
ఐపీఎల్ మ్యాచ్ కి కావేరీ జలాల సెగ తగులుతోంది. చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్ నిర్వహిస్తే.. స్టేడియంలోకి పాములను విసురుతామని బెదిరిస్తున్నారు.పూర్తి వివరాల్లోకి వెళితే.. రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్లోకి పునరాగమనం చేసిన చెన్నై సూపర్కింగ్స్.. సొంతగడ్డపై తొలి మ్యాచ్కు సన్నద్ధమైంది. మంగళవారం కోల్కతా నైట్రైడర్స్ను ఢీకొనబోతోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది.
అయితే కావేరీ జలాల వివాదం నేపథ్యంలో చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించకూడదని తమిళనాడు ప్రజలు, నేతలు ఆందోళనలు చేస్తున్నారు. తమ మాట కాదని మ్యాచ్ నిర్వహించాలని చూస్తే స్టేడియంలో పాములు వదులుతామని పీఎంకే నేత వేల్మురుగన్ హెచ్చరించడం వివాదాస్పదమైంది.
తమిళనాడులో కావేరీ నిర్వహణ మండలి ఏర్పాటుచేయాలని చాలా రోజులుగా ఆ రాష్ట్ర ప్రజలు ఆందోళన చేస్తున్నారు. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు నిరసనల్లో పాల్గొంటున్నారు. ఈ విషయంపై సోమవారం సుప్రీం కోర్టు స్పందిస్తూ కావేరి నిర్వహణ ప్రణాళికకు సంబంధించిన ముసాయిదాను రూపొందించి, మే 3 కల్లా తమకు సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది.
మరోవైపు ఆందోళనల నేపథ్యంలో మ్యాచ్ నిర్వహించే చెపాక్ స్టేడియం వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. 4 వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు.