భారత్ లో ఐఫోన్ మరింత ప్రియం
- అమాంతం పెరిగిన ఐఫోన్ ధరలు
- ఐఫోన్ ఎస్ఈ తప్ప అన్ని మోడల్స్ పై ధరల పెంపు
ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ యాపిల్.. ఐఫోన్ ధరలకు అమాంతం పెంచేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం.. ఇతర దేశాల నుంచి భారత్ కి ఇంపోర్ట్ చేసుకునే వస్తువులపై ట్యాక్స్ పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యాపిల్.. తమ కంపెనీకి చెందిన ఐఫోన్ ధరలను పెంచేసింది. ఒక్క ఐఫోన్ ఎస్ఈ మినహా అన్ని ఐఫోన్ మోడల్స్ పై 3.5శాతం రేటును పెంచేసింది.
ధరలు పెరిగిన తర్వాత.. అత్యంత ఖరీదైన ఐఫోన్ టెన్(X)256 జీబీ మోడల్ ధర రూ. 3000 నుంచి రూ.3500 పెరిగి భారత మార్కెట్లో రూ. 1,05,720గా ఉంది. ఇక ఐఫోన్ 6, 6ఎస్ మోడళ్ల ధరలు రూ. 1500 పెరిగి వరుసగా రూ. 30,780, రూ. 41,550గా ఉన్నాయి. కాగా.. ఐఫోన్ ఎస్ఈ ఫోన్ ధరలో మాత్రం ఎలాంటి మార్పులేదు. ఎందుకంటే ఐఫోన్ ఎస్ఈ ఫోన్ను భారత్లోనే తయారుచేస్తుండటంతో దానిపై దిగుమతి సుంకం ఉండదు. దీంతో ఆ ధరను పెంచట్లేదని యాపిల్ తెలిపింది.
ఇప్పటికే ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్ లో ఐఫోన్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. దీని కారణంగానే.. భారత్ లో ఐఫోన్ కొనగోళ్లు కాస్త మందగించాయి. ఈ పెరిగిన ధరలు.. సోమవారం నుంచి అమలు కానున్నాయి.