అనంతపురం తాహశీల్దార్ కు రు.25 వేలు జరిమానా
సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేసినందుకు శిక్ష
తాహశీల్దార్ ని కదా నన్నేవరూ ఏమిచేయలేరని అనంతపురం జిల్లాకు చెందిన ఈ తాహశీల్దారనుకున్నాడు. బహుశా ఎవరో లోకల్ అధికార పార్టీ నాయకుడిని అండకూడ ఉంటుంది. అందుకే అనామకుల దరఖాస్తులను ఆయన అలా చెత్తబుట్టలో తోసేసే వారు. అయితే, అలాతోసేసిన ఒక దరఖాస్తు ఆయనకు మెడకు చుట్టుకుంది. చివరకు రు. 25 జరిమానా కట్టాల్సి వస్తున్నది. తాహశీల్దార్ అంటేఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్. అలాంటి వ్యక్తి సమాచార చట్టం కింద వచ్చిన ఒక దరఖాస్తు ను ఖాతరుచేయకపోవడమేమిటి? జరిగిందిదే.
అనంతపురం రూరల్ మండలం ఇటుకలపల్లి సర్వే నెంబర్ 41–1బీ భూమికి సంబంధించిన ఆర్ఓఆర్ కాపీని ఇవ్వాలని ప్రకాశం జిల్లాకు (మార్కాపురం పట్టణం రామలక్ష్మమ్మ వీధికి) చెందిన మాజీ సైనికుడు బి.ముసలప్ప సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నాడు.
అడిగిన సమాచారం ఇవ్వకపోగా పనికిమాలిన సమాచారం అందించి చేయిదులుపుకున్నాడు. దీంతో ఖంగుతున్న దరఖాస్తుదారుడు, అందునా మిలిటరీ వాడు, సమాచార హక్కు చట్టం కింద కమిషనర్కు ఫిర్యాదు చేశాడు.
దీనికి స్పందించిన కమిషన్ వారంలోగా దరఖాస్తుదారు అడిగిన సమాచారాన్ని ఉచితంగా అందించడంతో పాటు కమిషనర్ ఎదుట హాజరు కావాలని 2016 నవంబర్ 25న తహశీల్దారుకు కమిషనర్ తాంతియా కేమారి ఆదేశాలు జారీ చేశారు.
తాహశీల్దార్ అపుడు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
ఆదేశాల ప్రకారం గడువులోగా సమాచారం ఇవ్వ లేదు. దీనితో దరఖాస్తుదారు ఈ విషయాన్ని కూడా కమిషనర్కు దృష్టికితీసుకువచ్చారు.
ఎగ్జిక్యూటివ మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న వ్యక్తి సమాచార హక్కు చట్టాన్ని ఇంతగా నిర్లక్ష్యం చేయడం,తప్పుడు సమాచారాన్ని అందించడం చేసినందుకు కమిషనర్ 2017 ఫిబ్రవరి 27న (కేస్ నెం: 41110–ఎస్ఐసీ–ఎల్టీకే 2016) రూ.25వేలు జరిమానా విధించడంతో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు.