టార్గెట్ డాక్టర్ .. కొత్తరకం దందా
- అందమైన యువతులు రంగంలోకి దిగి ఈ డాక్టర్లపై వలపు వల విసరుతున్నారు.
- వారి వలకు చిక్కారు అని నమ్మకం రాగానే.. వారిని బెదిరించి రూ.లక్షలు గుంజుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రకం దందా మొదలైంది. వారి టార్గెట్ ఎవరో తెలుసా..? 40 ఏళ్లలోపు డాక్టర్లు. అందమైన యువతులు రంగంలోకి దిగి ఈ డాక్టర్లపై వలపు వల విసరుతున్నారు. వారి వలకు చిక్కారు అని నమ్మకం రాగానే.. వారిని బెదిరించి రూ.లక్షలు గుంజుకుంటున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 11మంది డాక్టర్లు.. ఈ వలలో చిక్కుకున్నారు.
అసలు విషయానికి వస్తే..గుంటూరు, విజయవాడలో వైద్యులపై ఒక ముఠా అందాల వల విసురుతోంది. వీరంతా ముందుగానే తమ ‘టార్గెట్’లను నిర్ణయించుకుంటారు.బాగా డబ్బున్న 40 ఏళ్లలోపు డాక్టర్లనే ఎంచుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కో డాక్టర్ వద్దకు వెళతారు. వారికి ఆరోగ్యం సరిగాలేదనే సాకుతో ఆ డాక్టర్ దగ్గరికి రెండు మూడుసార్లు వెళతారు. ‘‘ఇక్కడ బాగా నొప్పిగా ఉందండి... చూడండి’’ అంటూ డాక్టర్ ఏమీ అడగకముందే చీరను మరింత కిందికి లాగి వారిని ఆకర్షిస్తున్నారు. ఆ తర్వాత డాక్టర్ ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి మాట్లాడటం ప్రారంభిస్తారు. ఆ డాక్టర్ వాళ్ల వలలో పడ్డాడు అని నమ్మకం రాగానే.. వలలో పడిన వైద్యుడి ని విందుకు, వినోదానికి ఇంటికి పిలిచి ట్రాప్ చేస్తారు. డాక్టర్తో సన్నిహితంగా మెలుగుతూ... ఆ దృశ్యాలను కెమెరాల్లో చిత్రీకరిస్తారు. ఆ తర్వాత సదరు వైద్యుడికి ఆ బొమ్మలు చూపించి... లక్షలు గుంజుతారు.
గుంటూరు, విజయవాడ, ఒంగోలు పట్టణాలకు ఈ ముఠా విస్తరించినట్లు తెలిసింది. గుంటూరులో నలుగురు డాక్టర్లు, విజయవాడలో ఐదుగురు, ఒంగోలులో ఇద్దరు అందాల వలలో పడినట్లు సమాచారం. మోసపోయి, లక్షలు పోగొట్టుకున్నప్పటికీ ఈ వైద్యులు తమ బాధను బయటికి చెప్పుకోలేకపోతున్నారు. సమాజం లో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న తాము ఇలా వలలో పడినట్లు తెలిస్తే... పరువు పోతుందనే భయంతో మౌనంగా ఉంటున్నారు.
గుంటూరులోని ఒక యువ డయాబెటాలజిస్ట్ నుంచి ఇప్పటికే భారీగా సొమ్ము వసూలు చేసిన ముఠా... మరింత వేధిస్తున్నట్లు తెలిసింది. సదరు డయాబెటాలజిస్ట్ తన బాధ ను స్నేహితుడైన మరో సూపర్ స్పెషాలిటీ డాక్టర్తో పంచుకున్నారు. దీంతో ఆయన మరింతగా కూపీ లాగారు. వాట్సప్ గ్రూప్ల ద్వారా సమాచారం పంపి.. డాక్టర్ల పేర్లు వెల్లడించనవసరం లేదని.. ఎవరైనా డాక్టర్లు ఇలా బ్లాక్మెయిల్కు గురైతే వివరాలు చెప్పాలన్నారు.