ఆ బైక్ లపై భారీ తగ్గింపు
- తగ్గనున్న లగ్జరీ బైక్ ధరలు
- ఇంపోర్టెడ్ బైక్ లపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన కేంద్రం
బైక్ ప్రియులకు శుభవార్త. ప్రముఖ లక్జరీ ద్విచక్రవాహనాల తయారీ సంస్థలైన హార్లే డేవిడ్సన్, ట్రయంఫ్ సంస్థలకు చెందిన బైక్ ల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఈ రెండు కంపెనీలపై కస్టమ్స్ ట్యాక్స్ ని ప్రభుత్వం తగ్గించింది. అంతకుముందు 800సీసీ, అంతకంటే తక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న హై ఎండ్ బైక్లపై 60శాతం, 800సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న బైక్లపై 75శాతం కస్టమ్స్ ట్యాక్స్ ఉండేది. తాజాగా ఈ రెండు వేరియంట్ల బైక్లపై ఉన్న కస్టమ్స్ డ్యూటీని 50శాతానికి తగ్గిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఈసీ) శాఖ నిర్ణయం తీసుకుంది. పూర్తిగా విదేశాల్లోనే అసెంబుల్ అయి దేశానికి వచ్చే బైక్లపై మాత్రమే సుంకాన్ని తగ్గిస్తున్నట్లు సీబీఈసీ పేర్కొంది. దీంతో ఆయా బైక్లపై ధరలు కూడా తగ్గనున్నాయి.
హార్లీ డేవిడ్సన్, ట్రయంఫ్, ఇండియన్ మోటార్స్, డిఎస్కె బెనెల్లీ వంటి ప్రీమియం బ్రాండ్లు భారత్లో షోరూంలను ఏర్పాటు చేసినప్పటికీ బైకులను మాత్రం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. భారత మార్కెట్లో ఇంపోర్టెడ్ బైకులు మరింత మందికి అందుబాటులోకి రావాలంటే కస్టమ్స్ డ్యూటీ తగ్గించాలని ఈ సంస్థలు ప్రభుత్వాన్ని కోరాయి.