భార్య కడుపులో కత్తెరతో పొడిచి చంపబోయిన భర్త
భార్యా భర్తల మద్య చిన్నగా మొదలైన వివాదం చివరకు భార్యను హత్య చేసే దాకా వెళ్లింది. ఇలా ఓ భర్త నిండు గర్భిణిగా వున్న భార్య కడుపులో పదునైన కత్తితో పొడిచి హత్య చేయబోయాడు. కట్టుకున్న భర్తే భార్యపై హత్యాయత్నం చేసి చివరకు తానుకూడా ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలోని మాన్కాపూర్ గ్రామానికి చెందిన కుట్టల్వార్ దుర్గాజీ, సునీత భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. దుర్గాజీ వ్యవసాయ కూలీగా పనిచేస్తూ భార్యా బిడ్డల్ని పోషిస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా భార్యాభర్తల మద్య గొడవలు జరుగుతున్నాయి. ఇలా మరోసారి ఇద్దరి మద్య మాటామాటా పెరిగి గొడవ జరిగింది. దీంతో ఆవేశం తట్టుకోలేకపోయిన దుర్గాజీ భార్య గర్భిని అనికూడా చూడకుండా కత్తెరతో కడుపులో పొడిచాడు. ఆ తర్వాత తాను కూడా విద్యుత్తు స్తంభం ఎక్కి తీగలను పట్టుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే అదే సమయంలో కరెంట్ పోవడంతో పైనుంచి కింద జారిపడ్డాడు.
స్థానికులు వెంటనే దుర్గాజీ, సునీతలను ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. బాధితురాలి తల్లి జాడేవార్ రుక్మాబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అబ్దుల్ మోబీన్ పేర్కొన్నారు.