భార్యను కిరాతకంగా హతమార్చిన భర్త
హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ భర్త కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
కూకట్ పల్లి పరిధిలోని మూసాపేట్ రాఘవేంద్ర సొసైటీలో నల్గొండ జిల్ల మల్లేపల్లికి చెందిన శ్రీను అనే వ్యక్తి భార్య దేవి, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు.వీరికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమయింది. పెళ్లి తర్వాత శ్రీను జీవనోపాధి కోసం హైదరాబాద్ కు వచ్చి పంజాగుట్టలోని ఓ డ్రై క్లీనింగ్ దుకాణంలో పనికి కుదిరాడు. అయితే ఇటీవల ఇతడి భార్య దేవి పుట్టింటివారు తమ స్వగ్రామం చింతపల్లిలో భూమిని విక్రయించారు. దీంతో భూమిని అమ్మగా వచ్చిన డబ్బుల్లో తనకు కొంత ఇవ్వాలని శ్రీను డిమాండ్ చేశాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి ఈ విషయంపై మరోసారి భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన శ్రీను భార్య గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.
నిందితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన శ్రీను పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యతో తల్లిదండ్రులు ఇద్దరికి దూరమై ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు.