Asianet News TeluguAsianet News Telugu

అదనపు కట్నం కోసం భార్యను హతమార్చిన భర్త

పెళ్లైన ఐదు నెలలకే దారుణం
husband killed his wife because of extra dowry

పెళ్లైన ఐదు నెలలకే మెట్టినింటివారి నుండి అదనపు కట్నం కోసం వేధిస్తూ చివరకు ఆమెను చిత్రహింసలు పెట్టి హతమార్చిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటుచేసుకుంది. కొత్తగా పెళ్లి చేసుకుని ఎన్నో ఆశతో అత్తవారింట్లో అడుగుపెట్టిన ఈమె చివరకు కట్నం వేధింపులకు బలయ్యింది. ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. 

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం నందిరెడ్డిపల్లెకు చెందిన సయ్యద్‌బాషా తన కుమార్తె షమీన(20)ను ఐదు నెలల క్రితం అంగళ్లు ప్రాంతానికి చెందిన ఇస్మాయిల్‌కు ఇచ్చి  ఘనంగా పెళ్లి చేశాడు. తన స్తోమతకు తగ్గట్లు కట్నం ఇచ్చి అత్తారింటికి పంపాడు. అయితే పెళ్లైన కొద్ది రోజులకు భర్తా అత్తామామలు అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. షమీనాను భర్తతో పాటు ఆడపడుచు గుల్‌జార్, అత్తామామలు రెడ్డిబూబు, దస్తగిరి వేధించేవారు. ఎంత వేధించినా మళ్లీ తండ్రికి భారం కాకూడదని భావించిన షమీనా ఈ బాధలను భరించిందే కానీ పుట్టినింటివారికి చెప్పలేదు. ఎంతకూ భార్య డబ్బులు తీసుకురాక పోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన భర్త గత నెల 22న షమీనాపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మంటల్లో కాలిపోతున్న షమీనాను గుర్తించిన స్థానికులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. 70 శాతం శరీరం కాలిపోవడంతో అప్పటినుండి చికిత్స పొందుతున్న ఈమె పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతిచెందింది.   

షమీనా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.  

Follow Us:
Download App:
  • android
  • ios