‘గోడ’ కోట రహస్యం
- నల్లడబ్బు దాచడానికి ‘నయా’ మార్గాలు
- ఐటీ అధికారులే షాక్ అవుతున్న వైనం
- బాత్ రూం గోడల నుంచి తులసి మొక్క దిమ్మెల వరకు
- అన్నీ నల్ల డబ్బు దాచుకునే లాకర్లే...
నల్ల కుబేరులు తన చుట్టూ ఉండగా ఆ కుబేరుడి అప్పును తిరుమల వేంకటేశ్వరుడు ఇంకేం తీర్చగలడు.
తిరుమల తిరుమతి దేవస్థానం సభ్యుడిగా ఉంటూ భారీగా నల్లడబ్బుతో దొరికిన శేఖర్ రెడ్డి అక్రమాల గురించి చెప్పాలంటే పైన చెప్పిన ఒక్క మాట చాలు. ఆయన ఎంతలా నల్ల డబ్బు కూడబెట్టాడో చెప్పడానికి.
ఆయన ఆస్తులను ఐటీ అధికారులు కరెక్టుగా కనుక్కుంటే కలియుగ వైంకుంఠుడి అప్పును ఈజీగా తీర్చేయవచ్చు.
తిరుమలలో వెంకటేశ్వరుడి గుడి బంగారంతో తాపడం చేశారని వింటేనే మనం ఆశ్చర్యపోతున్నాం. మరి, శేఖర్ రెడ్డి ఇంటి గోడలన్నీ బంగారంతో నిర్మించారంటే ఇంకెంత ఆశ్చర్యపోవాలి.
ఐటీ అధికారులు శేఖర్ రెడ్డి ఇంటిలో సోదాలు నిర్వహించగా వారికి దిమ్మతిరిగే బంగారం అక్కడ కనిపించింది. అదేదో ఇంటి లాకర్లలలో అనుకుంటే పొరబాటే..
శనివారం సాయంత్రం కాట్పాడి పరిధిలో శేఖర్రెడ్డికి చెందిన ప్రధాన ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. అక్కడ ఏకంగా ఆరు ట్రావెల్బ్యాగుల నిండా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును రెండు పరికరాలతో లెక్కగట్టారు.
అనంతరం ఓ గోడ నిర్మాణంపై అధికారులకు అనుమానం వచ్చి కూల్చిచూడగా బంగారు కడ్డీలు బయట పడ్డాయి. వాటితోపాటు రెండు సంచుల నిండా ఉన్న బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటి వరకు శేఖర్ రెడ్డి నుంచి మొత్తం రూ.131 కోట్ల నగదు, 170 కిలోల బంగారంను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక్కడ శేఖర్ రెడ్డి వద్ద నల్లధనం దొరికిన దానికంటే ఆయన దాన్ని దాచిన వైనం పైనే ఐటీ అధికారులతో సహా అందరూ చర్చించుకుంటున్నారు.
ఎవరైనా ఇటుకలతో గోడలు నిర్మిస్తారు.. కానీ ఇలా బంగారంతో గోడలు నిర్మించే వారు ఉంటారా అని ఆశ్చర్యపోతున్నారు.
గతంలో కూడా ఇలా నయా మార్గాల్లో నల్లడబ్బును దాచిన వారిని ఐటీ అధికారులు బాగానే కనిపెట్టారు.
వాటర్ ట్యాంకుల్లో, సెల్లార్ లలో, తులసీ దిమ్మల కింద, ఫొటో ఫ్రేమ్ ల వెనకాల ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో నల్ల డబ్బును దాచడానికి బడా బాబులు ప్రతి స్థలాన్ని తెగవాడేసుకుంటున్నారని చెప్పొచ్చు. కాకపోతే ఆ ‘గోడ’ కోట రహస్యాన్ని చేధించడానికి ఐటీ అధికారులకే చెమటలు పడుతున్నాయి.