6 నెలలు ఆగక్కర్లేదు..ఇక ముందు వెంటనే విడాకులు
- ఇద్దరు వ్యక్తలను ఒకటి చేసేది వివాహ బంధం.
- అలాంటి బంధం కొనసాగించడం కష్టం అనిపించిన వాళ్లు.. కోర్టు సహకారంతో వారి బంధానికి స్వస్తి పలుకుతారు
ఇద్దరు వ్యక్తలను ఒకటి చేసేది వివాహ బంధం. అలాంటి బంధం కొనసాగించడం కష్టం అనిపించిన వాళ్లు.. కోర్టు సహకారంతో వారి బంధానికి స్వస్తి పలుకుతారు. అయితే.. దాదాపు మన న్యాయవ్యవస్థ.. మేము విడిపోతాము అని వచ్చిన జంటలను అంత తొందరగా విడగొట్టదు. తిరిగి కలుసుకోవడానికి వారికి కొంత సమయాన్ని కేటాయిస్తుంది. ఆ సమయంలో వారు కావాలంటే తిరిగి కలవచ్చు.. లేదా.. ఇచ్చిన సమయం గడిచిన తర్వాత కూడా వారు విడిపోవాలనే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటే వారికి అప్పుడు శాస్వతంగా విడాకులు మంజూరు చేస్తారు. ఇప్పటి వరకు అమలౌతున్న విధానం ఇదే. అయితే.. ఈ విధానంలో న్యాయస్థానం కొన్ని సడలింపులు చేసింది.
1955 హిందూ వివాహ చట్టం కింద పరస్పరాంగీకారంతో విడాకులు కోరిన కేసుల్లో...వాటి మంజూరుకు తీసుకుంటున్న కనీస ఆరునెలల వ్యవధిని అవసరమనిపించిన సందర్భాల్లో సంబంధిత కోర్టులు రద్దు చేయవచ్చని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. విడాకులు కోరుతూ విడివిడిగా ఉంటున్న దంపతులు కాస్త విరామాన్నిస్తే తిరిగి రాజీపడి ఒక్కటయ్యే అవకాశాన్నిచ్చేందుకు ఇలా కనీసం ఆరునెలల వ్యవధిని ఉద్దేశించారు. అయితే.. కొన్ని సందర్భాలలో వీరికి సమయం ఇవ్వడం అనవసరం అనిపించినా.. వీరికి తక్షణమే విడాకులు మంజూరు చేయాలని అనిపించన సమయంలో.. ఈ ఆరు నెలల వ్యవధిని రద్దు చేయవచ్చని సుప్రీం కోర్టు తెలిపింది. ఆ సమయాన్ని రద్దు చేసి వెంటనే విడాకులు మంజూరు చేయవచ్చని న్యాయస్థానం పేర్కొంది.
ఇద్దరు భార్యభర్తల విడాకుల విషయంలో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. అమర్ దీప్ సింగ్, హర్వీన్ కౌర్ అనే ఇద్దరికి 1994లో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. 1995లో ఒకరు జన్మించగా.. 2003లో మరొకరు జన్మించారు. అయితే భార్యభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా వీరు 2008 నుంచి విడివిడిగా ఉంటారు. దాదాపు 8 సంవత్సరాలు గా వీరిద్దరూ విడిగానే బతుకుతున్నారు. చివరికి 2017 ఏప్రిల్ లో వీరికి విడాకులు మంజూరయ్యాయి. భర్త భార్యకి బరణంగా రూ.2.75కోట్ల ఇచ్చేందుకు అంగీకరించారు.
వీరిద్దరిని తిరిగి కలిపేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. సాధారణంగా ఏ న్యాయస్థానమైనా వారు కలిసి ఉంచేందుకే ప్రయత్నిస్తుంది. అలా కాకుండా భార్యభర్తల మధ్య సయోధ్య కుదరకపవడం, మధ్యవర్తిత్వం కూడా ఫలించకపోతే అలాంటి వారికి వెంటనే విడాకులు మంజూరు చేయవచ్చని న్యాయస్థానం తెలిపింది.