కెసిఆర్ కు ఘన స్వాగతాలా ?
తనకు లభించనున్న స్వాగత సత్కారాలతో వచ్చే ఎన్నికల్లో సీమాంధ్రలోనూ పోటీ చేసే విషయాన్ని కెసిఆర్ ఆలోచించినా ఆశ్చర్యం లేదు.
తెలంగాణా సిఎం కెసిఆర్ కు తిరుపతిలో స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయట. స్వామివారికి మొక్కు తీర్చుకునేందుకు కెసిఆర్ కుటుంబసభ్యలతో మంగళవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అందుకని విమానాశ్రయం నుండి అలిపిరి వద్ద వరకూ భారీ ఎత్తున కటౌట్లు, పోస్టర్లు, హోర్డింగ్ లు వెలిసాయి. కెసిఆర్ స్వాగతానికి జరుగుతున్న ఏర్పాట్లు చూసి స్ధానికులు విస్తుపోతున్నారు.
రాష్ట్ర విభజనకు కారకుడైన వ్యక్తికి ఇంతస్ధాయిలో స్వాగతానికి ఏర్పాట్లు జరగటమంటే మాటలు కాదు. సీమాంధ్ర ప్రజల్లో కూడా కెసిఆర్ పట్ల విభజన నాటి ఆగ్రహం కనబడటం లేదు. అలాగని రాష్ట్ర విభజనను అందరరూ స్వాగతించారని కాదు. మరి ఈ స్ధాయిలో స్వాగత ఏర్పాట్లు ఎందుకు? అక్కడే ఉంది మతలబు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ఓకేసారి ఏర్పడటంతో ఇద్దరి పరిపాలనను జనాలు పోల్చి చూసుకుంటున్నారు. ఈ పోలికలో 40 ఇయర్స్ ఇండస్ట్రి చంద్రబాబునాయుడు మొదటిసారి సిఎం అయిన కెసిఆర్ ముందు తేలిపోతున్నారు.
సిఎంగా చంద్రబాబు కన్నా కెసిఆరే బెటరని సీమాంధ్రలో కూడా అనిపించుకుంటున్నారు. దాంతో ప్రజల్లో కెసిఆర్ పట్ల ఆగ్రహం పోయి అభిమానం వ్యక్తమవుతోంది. అందుకే మొన్నటి కెసిఆర్ పుట్టిన రోజు వేడుకలను తెలంగాణా వ్యాప్తంగానే కాకుండా ఏపిలోని తెనాలి, భీమవరం తదితర చోట్లా జరుపుకున్నారు. దానికితోడు కెసిఆర్ లాంటి వ్యక్తే ఏపికి కూడా సిఎం అయితే తప్ప అభివృద్ధి జరగదని ఇప్పటికే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లే సీమాంధ్రలో క్రేజ్ కూడా సంపాదించుకుంటున్నారు. అదే సమయంలో చంద్రబాాబు పాలనపై జనాల్లో వ్యతరిేకత బాగా పెరిగిపోతోంది.
చంద్రబాబుపై వ్యతరిేకత పెరుగుతోంది కానీ ప్రత్యామ్నాయం ఏమటన్న విషయంలోనే ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఇటువంటి నేపధ్యంలోనే కెసిఆర్ కు అనుకూలంగా ఏపిలో కూడా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. . దాంతో పాటు అన్ని విషయాల్లోనూ చంద్రబాబు-కెసిఆర్ వ్యవహారశైలిని పోల్చి చూస్తున్నారు. ఈ పోలికే కెసిఆర్కు ఉద్యమ నేతగా కన్నా మంచి పాలనాధక్షుడనే క్రేజ్ తెచ్చింది. ఏమో జనాల ఊపు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో సీమాంధ్రలోనూ పోటీ చేసే విషయాన్ని కెసిఆర్ ఆలోచించినా ఆశ్చర్యం లేదు.