కోలుకుంటున్న బంగారం
- పదిగ్రాముల బంగారం ధర రూ.29,665
- కేజీ వెండి ధర రూ.38,280
పది రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధర కాస్త కోలుకుంది. గత వారం బంగారు ఆభరణాల కొనుగోళ్లు భారీగా తగ్గడంతో 12రోజుల్లో రూ.1,551 వరకు తగ్గింది. కాగా.. ఇప్పుడు మళ్లీ బంగారం పుంజుకుంది. రూ.230 పెరిగి పది గ్రాముల బంగారం ధర రూ.29,665కి చేరుకుంది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో పసిడి ధర పెరిగినట్లు బులియన్ ట్రేడింగ్ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు వెండి ధర పెరిగి.. రూ.38వేల మార్కుకు చేరుకుంది. రూ.680 పెరగడంతో కిలో వెండి ధర రూ.38,280గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి భారీగా కొనుగోళ్లు జరగడంతో వెండి ధర పెరిగినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడం, డాలర్ విలువ మారకపోవడం బంగారం ధర పెరుగుదలకు కలిసొచ్చిందని ట్రేడర్లు తెలిపారు. అంతర్జాతీయంగా బంగారం ధర 0.17శాతం పెరిగి ఔన్సు 1,257.50 డాలర్లు పలికింది.