రూ.30వేల కిందకు పసిడి ధర
- పది గ్రాముల బంగారం ధర రూ.29,750
- కేజీ వెండి ధర రూ.39,300
బంగారం ధర ఈరోజు తగ్గుముఖం పట్టింది. తులం బంగారం ధర రూ.30వేల దిగువకు చేరింది. ఈరోజు రూ.300 తగ్గి.. పది గ్రాముల బంగారం ధర రూ.29,750కి చేరింది. స్థానిక వ్యాపారుల నుంచి బంగారు ఆభరణాల కొనుగోళ్లు మందగించడంతో ధర తగ్గినట్లు బులియన్ వర్గాలు తెలిపాయి. పసిడి బాటలోనే వెండి కూడా నడించింది. వెండి ధర కూడా నేడు తగ్గుముఖం పట్టింది. మొన్నటి వరకు 40వేల మార్క్ లో ఉన్న వెండి.. ఆ మార్క్ దిగువకు చేరింది. రూ.800 తగ్గి..కేజీ బంగారం ధర రూ.39,300కి చేరింది. నాణెల కొనుగోళ్లు తగ్గడంతో వెండి ధర తగ్గినట్లు బులియన్ ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
అంతర్జాతీయంగా 0.09శాతం తగ్గి ఔన్సు పసిడి ధర 1,270 డాలర్లకు చేరింది. దేశ రాజధాని దిల్లీలో 99.9శాతం స్వచ్ఛత గల తులం బంగారం ధర రూ.29,750 కాగా, 99.5 శాతం స్వచ్చతగల బంగారం ధర రూ.29,600గా ఉంది.
ఇదిలా ఉండగా..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయంగా బంగారం దిగుమతులు రెండింతలయ్యాయని అధికారులు తెలిపారు.ఏప్రిల్-జులై త్రైమాసికంలో వీటి విలువ 13.35 బిలియన్ డాలర్లకు చేరిందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాల ద్వారా వెల్లడైంది. గతేడాది ఇదే సమయంలో కరెంట్ ఖాతాలోటు 4.97 బిలియన్ డాలర్లుగా ఉంది. కిందటి సంవత్సరం జులై మాసంలో 1.07 బిలియన్ డాలర్లుగా ఉన్న పసిడి దిగుమతులు ముగిసిన జులైలో 2.10 బిలియన్ డాలర్లకు చేరాయి