మరింత కిందకు దిగిన పసిడి
- పది గ్రాముల బంగారం ధర రూ.29,400
- కేజీ వెండి ధర రూ.37,775
మొన్ననే పెళ్లిళ్ల సీజన్ ముగిసింది. మళ్లీ పెళ్లిళ్ల సీజన్ రావాలంటే ఫిబ్రవరి, మార్చి నెల వరకు ఆగాల్సిందే అంటున్నారు పెద్దలు. దీంతో బంగారం కొనేవారి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోంది. కొనేవారి సంఖ్య తగ్గేసరికి పసిడి ధర కూడా తగ్గుతూ వస్తోంది.
నేటి మార్కెట్లో రూ.180 తగ్గి పది గ్రాముల బంగారం ధర రూ.29,400కి చేరింది. మొత్తంగా వారం రోజుల్లో పసిడి ధర రూ.1000 తగ్గింది. అంతేకాకుండా బంగారం ధర నాలుగు నెలల కనిష్ఠానికి పడిపోయినట్లు బులియన్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పాటు దేశీయంగా కూడా కొనుగోళ్లు లేకపోవడంతో ధరలు తగ్గినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి.
అంతర్జాతీయంగానూ 0.54శాతం తగ్గి ఔన్సు బంగారం ధర 1,241.40 డాలర్లుగా ఉంది. అటు వెండి కొనుగోళ్లది కూడా అదే పరిస్థితి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో వెండి ధర కూడా తగ్గుతూ వస్తోంది. మంగళవారం నాటి మార్కెట్లో కేజీ వెండి రూ. 25 తగ్గి రూ. 37,775గా ఉంది.