భారీగా పెరిగిన బంగారం ధర
- రోజు రోజుకీ పెరిగిపోతున్న బంగారం ధర
- పసిడి బాటలోనే వెండి
బంగారానికి మళ్లీ రెక్కలు వచ్చాయి. గురువారం నాటి మార్కెట్లో బంగారం ధర మళ్లీ పెరిగింది. దాదాపు రెండేళ్ల గరిష్టానికి పసిడి ధర ఎగబాకింది. మరోవైపు డాలర్ విలువ మూడేళ్ల కనిష్టానికి పడిపోయింది. నేటి మార్కెట్లో రూ.350 పెరిగి పది గ్రాముల బంగారం ధర రూ.31,450కి చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో 0.3శాతం పెరిగి ఔన్సు బంగారం ధర 1360.60డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో 2016 ఆగస్టు నెల తర్వాత బంగారం ధర ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. పసిడి ధర మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వెండి కూడా పసిడి బాటలోనే నడిచింది.రూ.1100 పెరిగి కేజీ వెండి ధర రూ.41 వేలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర 0.2శాతం పెరిగింది.