తగ్గిన పసిడి ధర
రూ.32వేల దిగవకు బంగారం ధర
బంగారం ధర తగ్గింది.బుధవారం ఒక్కరోజే రూ.430 తగ్గిన బంగారం ధర నేడు మరింత తగ్గింది. అంతర్జాతీయ పరిస్థితులు, డిమాండ్ లేమి కారణంతో పసిడి ధర రూ.32వేల మార్క్ దిగువకు పడిపోయింది. గురువారం బంగారం ధర రూ.240 తగ్గడంతో పదిగ్రాముల పసిడి ధర రూ.31,780కి చేరింది. స్థానిక ఆభరణాల తయారీదారులు, రిటైలర్ల దగ్గర నుంచి డిమాండ్ లేకపోవడం, అంతర్జాతీయ పరిణామాల ప్రభావం బంగారం ధరపై పడుతోందని బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు వెండి ధర మాత్రం స్వల్పంగా పుంజుకుంది. రూ.100 పెరగడంతో కిలో వెండి రూ.40,750కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల దగ్గర నుంచి స్పల్పంగా డిమాండ్ రావడంతో వెండి ధర పెరిగినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. ఇక అంతర్జాతీయంగా బంగారం ధర తగ్గింది. పసిడి ధర 0.16శాతం తగ్గడంతో ఔన్సు ధర 1,288.10 డాలర్లు పలికింది. వెండి ధర 0.09శాతం తగ్గి ఔన్సు 16.34 డాలర్లు పలికింది.