బతికుండగానే.. చనిపోయిందని చెప్పిన వైద్యులు
- విజయవాడ నగరంలో దారుణం
- నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వాసుపత్రి వైద్యులు
ఒంట్లో నలతగా ఉందని హాస్పటల్ కి వెళితే.. ఏకంగా చనిపోయిందని చెప్పారు. తీరా ఇంటికి తీసుకువచ్చి అంత్యక్రియలు ఏర్పాటు చేయబోతే.. చనిపోయిందనకున్న బిడ్డ లో చలనం కనిపించింది. ఈ సంఘటన విజయవాడ నగరంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. రాజరాజేశ్వరి పేటకు చెందిన సాయిదుర్గ(12) అనే బాలిక అకస్మాత్తుగా కళ్లు తిరిగి కింద పడిపోయింది. దీంతో బాలికను తల్లిదండ్రులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలిక కోమాలోకి పోయిందని చెప్పారు. కాసేపటి తర్వాత.. బాలిక చనిపోయిందని.. శవాన్ని ఇంటికి తీసుకువెళ్లండి అని ఆమె తల్లిదండ్రులకు చెప్పారు.
కుమార్తెని పొగొట్టుకున్నామనే బాధతో బాలిక శవాన్ని ఇంటికి తీసుకువచ్చిన కుటుంబసభ్యులు శనివారం ఉదయం అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. కాగా.. ఆ సమయంలో బాలికలో చలనం రావడాన్ని బంధువులు గుర్తించారు. పరీక్షించి చూడగా.. బాలిక ప్రాణంతో ఉన్నట్లు తెలిసింది. దీంతో వెంటనే సమీపంలోని గ్లోబల్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బతికుండగానే చనిపోయిందని చెప్పడం ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోంది. దీంతో బాలిక బంధువులు ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.