స్పీకర్ "పోస్టుమార్టం" పై గండ్ర నిప్పులు
- కేసీఆర్ సర్కారును విమర్శిస్తే పోస్ట్ మార్టం చేస్తామని స్పీకర్ వ్యాఖ్యలు
- స్పీకర్ మధుసూదనాచారి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ కాంగ్రెస్ నేత గండ్ర
- స్పీకర్ హోదాలో ఉండి అలా మాట్లాడటంతో మధుసూదనాచారిపై విమర్శలు
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి పై కాంగ్రెస్ నేత, మాజీ చీఫ్ విప్ గండ్ర రమణారెడ్డి మండిపడ్డారు. స్పీకర్ పదవిలో పార్టీ నేత మాదిరిగా మాట్లాడడం సరి కాదన్నారు. ఒక స్పీకర్ హోదాలో ఉండి ఇలా మాట్లాడుతారా, స్పీకర్ గా ఉండి మాట్లాడే భాష ఇదేనా అని ప్రశ్నించారు.
భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండలంలో లక్ష్మీ నరసింహ స్వామి పాలక మండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ మధుసూదనాచారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. కేసీఆర్ సర్కారును ఎవరైనా విమర్శిస్తే ప్రతిపక్ష నేతలను అక్కడికక్కడే పోస్టుమార్టం చేస్తామని కామెంట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో విపక్ష నేతలు కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే సహించేదిలేదు అని మధుసూదనాచారి హెచ్చరించారని తెలిసింది.
స్పీకర్ చేసిన కామెంట్స్ మీద గండ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరే స్పీకర్ కుర్చీలో ఉన్నారు కాబట్టి మీరు బతికి ఉన్నన్ని రోజులు ఎమ్మెల్యేగా ఉండాలి అని చట్టం చేసుకోండి అంటూ చురకలు అంటించారు. స్పీకర్ గా ఉన్న వ్యక్తి పార్టీ కార్యక్రమాలకు హజరు కావద్దు.
కానీ హాజరవుతున్నారు దానిని ఆయన విగ్నతకే వదిలేస్తున్నా అని గండ్ర పేర్కొన్నారు. స్పీకర్ వెంటనే తన మాటలను ఉపసంహరిన్చుకోవాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. ఇది మొదటి తప్పుగా భావిస్తున్నాం... మళ్లీ పునరావృతం అయితే మేము కూడా అదే భాషను వాడాల్సి ఉంటుందని హెచ్చరించారు.
మొత్తానికి రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న స్పీకర్ పోస్టుమార్టం భాష వాడినట్లు వస్తున్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి.