తెరపైకి మళ్లీ ‘ ఫ్రీడం 251’ స్మార్ట్ ఫోన్
- మళ్లీ తెరపైకి ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్
- రూ.7కోట్లు టోకరా పెట్టిన రింగింగ్ బెల్స్ సంస్థ
- మళ్లీ ఆ ఫోన్ లను అందిస్తామంటున్న కంపెనీ ఎండీ
‘ఫ్రీడం 251’ ఈ ఫోన్ గురించి అందరూ వినే ఉంటారు. 2016లో ఈ ఫోన్ ప్రకటన ఒక సంచలనం ఎందుకంటే.. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్ ఇస్తామంటూ నోయిడాకి చెందిన రింగింగ్ బెల్స్ కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు ఆ ఫోన్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఒక వేళ ప్రభుత్వం సహకారం అందిస్తే వచ్చే ఏడాది ఈ స్మార్ట్ ఫోన్ ని ప్రజలకు అందజేస్తానని రింగింగ్ బెల్స్ కంపెనీ ఎండీ మోహిత్ గోయల్ ప్రకటించారు.
తాను ఇప్పటికీ ‘మేకిన్ ఇండియా’ నినాదానికి కట్టుబడి ఉన్నానని మోహిత్ చెబుతున్నారు. ప్రభుత్వం సహకారం అందిస్తే ఫోన్ను ఇస్తానని తెలిపారు. ‘ఇవాళ ఓ పెద్ద సంస్థ నా మోడల్ను అనుకరించి కార్బన్ వంటి కంపెనీలతో కలిసి రూ.1300కే స్మార్ట్ఫోన్ను అందిస్తోంది. జియో సైతం రూ.1500కే స్మార్ట్ఫోన్ను అందిస్తోంది. అంత తక్కువ ధరకు వారెలా అందిస్తున్నారని ప్రజలు ఎందుకు అడగడం లేదు?’ అని ప్రశ్నించారు.
గతేడాది ఫిబ్రవరిలో 25 లక్షల స్మార్ట్ఫోన్లను రూ.251కే అందిస్తామని రింగింగ్ బెల్స్ కంపెనీ ప్రకటించింది. దీంతో సుమారు 7కోట్ల మంది ఇందుకోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో సైట్ కూడా క్రాష్ అయ్యింది. అప్పట్లో ఇది పెద్ద సంచలనం అయ్యింది. ఆ తర్వాత 5వేల స్మార్ట్ఫోన్లను పంపిణీ చేసిన కంపెనీ చేతులెత్తేసింది. అయితే, తమ వద్ద రూ.16లక్షలు తీసుకుని మోసం చేశారంటూ కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఫిర్యాదు చేయడంతో మోహిత్ను ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్పై బయటకి వచ్చారు.