రెండు గదుల అపార్టుమెంట్ నుంచి...: ఫ్లిప్ కార్ట్ జర్నీ ఇదీ...
దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్డ్ జర్నీ అతి సాధారణంగా ప్రారంభమైంది. అలా ప్రారంభమైన అది వాల్ మార్ట్ దృష్టిని ఆకర్షించింది.
న్యూఢిల్లీ: దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్డ్ జర్నీ అతి సాధారణంగా ప్రారంభమైంది. అలా ప్రారంభమైన అది వాల్ మార్ట్ దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు అది వాల్ మార్ట్ సొంతమైంది.
ఐఐటి ఢిల్లీ గ్రాడ్యుయేట్లు ఇద్దరు అమెజాన్ లో తమ ఉద్యోగాలను వదిలేసి ఈ సంస్థను ప్రారంభించారు. వ్యాపారవేత్తలుగా ఎదగాలనే కలలు కంటున్న వీళ్లు బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో రెండు బెడ్రూం ఆపార్టుమెంటులో 11 ఏళ్ల క్రితం దీన్ని స్థాపించారు.
ఆ సంస్థను ప్రారంభించిన ఇద్దరు బిన్నీ బన్సాల్, సచిన్ బన్సాల్ చండీగఢ్ కు చందినవారు. చివరి పేర్లు ఒక్కటిగానే ఉన్న వారు సమీప బంధువులు కూడా కారు. ఐఐటి- ఢిల్లీలో చదువుకుంటున్నప్పుడు ఇద్దరికి మధ్య పరిచయం ఏర్పడి అమెజాన్ లో చేరిన తర్వాత స్నేహితులుగా మారారు.
బెంగళూరులో మొదటి కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత వారు ఢిల్లీ, ముంబైల్లో కూడా ఫ్లిప్ కార్ట్ కార్యాలయాలను తెరిచారు. రెండు గదుల అపార్టుమెంటులో ప్రారంభించిన ఆ కార్యాలయం ప్రస్తుతం 8.3 లక్షల చదరపు అడుగులకు విస్తరించింది.
ఇటీవల బెంగళూరులో ఓ పెద్ద క్యాంపస్ ను కూడా ఫ్లిప్ కార్ట్ ప్రారంభించింది. బెంగళూరులో ఉన్న కార్యాలయాలను అన్నింటినీ ఈ క్యాంపస్ లోకి తరలించింది.