బిజెపి ఎంపీ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం
- బళ్ళారి ఎంపి శ్రీరాములు ఇంట్లో అగ్ని ప్రమాదం
- ఎంపీ పిల్లలకు స్వల్ప గాయాలు
బీజేపి ఎంపి బి. శ్రీరాములు ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం జరిగిన ఈ ప్రమాద సమయంలో ఎంపీతో పాటు అతడి కుటుంబసభ్యులు కూడా ఇంట్లోనే ఉన్నారు. ఈ అగ్నిప్రమాదాన్ని గమనించి జాగ్రత్తపడటంతో ఎంపీతో పాటు కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు.
వివరాల్లోకి వెళితే డిల్లీ ఫిరోజ్ షా రోడ్ లోని కర్ణాటక ఎంపి శ్రీరాములు నివాసంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు చెలరేగడంతో ఎంపీ కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ అగ్నిప్రమాద వివరాలను శ్రీరాములు మీడియాకు వెల్లడించారు. ఇవాళ తెల్లవారుజామున తమ నివాసంలో అగ్నిప్రమాదం సంభవించిందని.. అయితే ఈ ప్రమాదం నుంచి కుటుంబం మొత్తం తృటిలో బయటపడ్డామని తెలిపారు. అయితే ఈ ఘటనలో తమ పిల్లలకు స్వల్ప గాయాలైనట్లు ఎంపీ చెప్పారు. ప్రస్తుతం తామంతా సురక్షితంగా ఉన్నామని.. ఎవరూ ఆందోళన చెందవద్దని ఎంపీ ప్రజలకు సూచించారు.