Asianet News TeluguAsianet News Telugu

‘ఆటో’కు గుడ్‌న్యూస్?!: జీఎస్టీ తగ్గింపుకు ప్రపోజల్స్ ఇవ్వండి: అనురాగ్ ఠాకూర్

ఆటోమొబైల్ రంగానికి ఉద్దీపన అందించేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తోంది. జీఎస్టీ తగ్గించేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆటోమొబైల్ రంగానికి చెందిన వివిధ వర్గాల ప్రతినిధులను కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ కోరడమే దీనికి నిదర్శనం.
 

Finance Ministry tells auto makers, if you want GST rate cut, bring states on board
Author
New Delhi, First Published Sep 8, 2019, 12:17 PM IST

ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ ముందుకు వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రత్యేకించి 28 శాతం శ్లాబ్ జీఎస్టీని తగ్గించేందుకు ప్రతిపాదనలను సమర్పించాలని ఆటోమొబైల్ రంగ పరిశ్రమ ప్రముఖులను, సంస్థలను కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ కోరారు.

ఎషీఎంఏ వార్షిక సమావేశంలో ఆయన ఈ సంగతి చెప్పారు. కేంద్ర ఆర్థికశాఖకు ప్రతిపాదనలు సమర్పించడంతోపాటు వాటిని సంబంధిత రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు కూడా పంపాలని సూచించారు. జీఎస్టీ శ్లాబ్ తగ్గింపు విషయమై తుది నిర్ణయం తీసుకునే అధికారం తీజీఎస్టీ కౌన్సిల్‌కు మాత్రమే ఉన్నందున ఈ అభ్యర్థన చేశామని చెప్పారు. 

ప్రస్తుతం ఆటోమొబైల్ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. దాదాపుగా రెండేళ్లుగా ఆటోమొబైల్ వాహనాల విక్రయాలు రోజురోజుకు పడిపోయాయి. 2001 సెప్టెంబర్ తర్వాత గతేడాది ఆగస్టు నెల విక్రయాలు తొలిసారి అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి.

ప్రత్యేకించి జీఎస్టీ శ్లాబ్‌లు, వ్యవసాయ రంగంలో సంక్షోభం తదితర కారణాలతో ఆటోమొబైల్ రంగం కోలుకోవడం లేదు. వాహనాల విడిభాగాలన్నింటిపై ఒకే జీఎస్టీ శ్లాబ్ 18 శాతం మాత్రమే విధించాలని ఆటోమొబైల్ కాంపొనెంట్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఎసీఎంఏ) కోరింది.

దీనివల్ల వర్కింగ్ కేపిటల్ రుణాలను దీర్ఘ కాలిక ఆస్తుల్లో పెట్టుబడులుగా పెట్టడానికి ఉపయోగించుకునే అవకాశం ఆయా సంస్థలకు లభిస్తుందని తెలిపింది. ప్రస్తుతం వాహన విడి భాగాల రంగంలో 50 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. దేశీయ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 2.3 శాతం వాహన విడి భాగాల పరిశ్రమదే కావడం గమనార్హం.

‘దేశీయంగా వాహనాల తయారీ దారులు గిరాకీ పెంచడానికి చర్యలు తీసుకుంటున్నారు. విడి భాగాల రంగం మొత్తానికి జీఎస్టీ శ్లాబ్ 18 శాతానికి తగ్గించి ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని ఏసీఎంఏ ప్రెసిడెంట్ రాం వెంకటరమణి కోరారు. 

‘మేం ప్రధానంగా బీ2బీ (వాహన తయారీ దారులకే అందిస్తారు) వ్యాపారంలో ఉన్నందున జీఎస్టీ శ్లాబ్ 18 శాతానికి కుదించినా, ప్రభుత్వ ఖజానాపై పెద్దగా ప్రభావం ఉండదు. వర్కింగ్ కేపిటల్‌గా తీసుకున్నరుణాలను దీర్ఘకాలిక ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి అవకాశం లభిస్తుంది’ అని రాం వెంకట రమణి తెలిపారు

ఏసీఎంఏ సంఘం సమావేశంలో సంఘం నూతన అధ్యక్షుడిగా లుమాక్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ జైన్ నియమితులయ్యారు. సంఘం ఉపాధ్యక్షుడిగా సోనా కామ్ స్టార్ సంస్థ చైర్మన్ సంజయ్ కపూర్ నియమితులు అయ్యారని ఏసీఎంఏ తెలిపింది. 

వీరు 2019-21 మధ్య కాలంలో అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా కొనసాగుతారని పేర్కొంది. ఆటోమొబైల్ కాంపొనెంట్స్ రంగానికి 90శాతం టర్నోవర్ అందించే సంస్థల్లో 800కి పైగా ఏసీఎంఎలో సభ్యత్వం కలిగి ఉండటం గమనార్హం. 

ఇదిలా ఉంటే వెహికల్స్‌లో వినియోగించే ఎలక్ట్రానిక్ పరికరాలను దేశీయంగా తయారు చేయాలని విడి భాగాల తయారీ సంస్థలను దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి మేనేజింగ్ డైరెక్రట్ కెనిచి ఆయుకవా కోరారు. అప్పుడు విదేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు.

తద్వారా దిగుమతి సుంకం తగ్గుముఖం పడుతుందని మారుతి సుజుకి మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి ఆయుకవా చెప్పారు. భారతదేశంలోనే విడి భాగాలను తయారు చేయడం వల్ల ‘మేకిన్ ఇండియా’ ఇన్షియేటివ్‌కు ఊతమిచ్చినట్లవుతుందన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios