రైతన్న కష్టాలు తీరేనా..
- ప్రభుత్వానికి వ్యవసాయ రంగం అత్యంత ముఖ్యమైంది. ఈ రంగంలో అభివృద్ధిని సాధించకుండా దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందింది అని చెప్పలేము' అంటూ ఇటీవల అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన ఈ సారి బడ్జెట్లో వ్యవసాయ రంగంపై మోదీ సర్కార్ దృష్టిపెట్టిందని పరోక్షంగా సూచించింది.
వ్యవసాయం దేశానికి వెన్నుముక. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతులు వ్యవసాయం చేయడం మానేస్తే.. దేశంలో తినడానికి తిండి కూడా దొరకదు. అలాంటి రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. 'ప్రభుత్వానికి వ్యవసాయ రంగం అత్యంత ముఖ్యమైంది. ఈ రంగంలో అభివృద్ధిని సాధించకుండా దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందింది అని చెప్పలేము' అంటూ ఇటీవల అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన ఈ సారి బడ్జెట్లో వ్యవసాయ రంగంపై మోదీ సర్కార్ దృష్టిపెట్టిందని పరోక్షంగా సూచించింది. వచ్చే ఐదేళ్లలో వ్యవసాయ రంగం ఆదాయం రెట్టింపు చేస్తామని 2014 పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్రమోదీ పదేపదే ప్రజలకు హామీలు గుప్పించారు. కానీ ఆచరణలో మాత్రం సాధ్యంకాలేదు. కాగా.. దీనిని ఈ బడ్జెట్ లో అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పంట పండక కొందరు రైతులు నష్టపోతుంటే.. పంటకు సరైన మద్దతు ధర లభించక కూడా రైతులు నష్టపోతారు. ఈ సమస్యను పరిష్కరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ఓ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ‘భవంతర్ భుగ్తాన్ యోజన’ (Bhavantar Bhugtan Yojana (BBY))పథకాన్ని ప్రవేశపెట్టి దాని ద్వారా రైతులకు కనీస మద్దతు ధర అందించాలని అనుకుంటోంది. దీని ప్రకారం రైతుల తమ పంట విస్తీర్ణాన్ని రిజిస్టర్ చేసుకోవాలి. అధికారులు దీనిని తకిఖీ చేస్తారు. పంట వచ్చాక ధరలో తేడాలొస్తే,ప్రభుత్వం చెల్లిస్తుంది. దీనిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం అమలుపరుస్తోంది. 5 ఖరీఫ్ పంటల కోసం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ని అందజేస్తోంది.
హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే రకమైన పథకాన్ని కూరగాయ పంట రైతులకు అందజేస్తోంది. రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి రైతుకు ఎకరానికి రూ.4వేల చొప్పున నగదును ప్రతి సంవత్సరం అందజేస్తామని చెప్పింది. వీటిని రైతులు పెట్టుబడులుగా ఉపయోగించుకోవచ్చు.
ఇక తెలంగాణ ప్రభుత్వం మరొక రకం రైతు సహాయక పథకం తీసుకువచ్చింది. ఈ పథకం కింద రైతులు రిజస్టర్ చేసుకోవనసరం లేదు. అలాగే పంటల నియమం లేదు. ఎకరానికి ఏడాదికి 8 వేల రుపాయలందిస్తారు. ఇందులో నాలుగు వేలు ఎరువులకు, మిగతా మొత్తం ఇతర ఖర్చులకు. ఈ ఖర్చలు రైతు ఇష్టం. డబ్బు నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్ కు జమఅవుతుంది. ప్రముఖ వ్యవసాయ ఆర్థిక వేత్త అశోక్ గులాటి ఈ పథకాన్ని ప్రశంసించారు. ఇలాంటి పథకమే చైనాలో జాతీయ స్థాయిలో అమలులో ఉందని ఆయన చెప్పారు. ఇలాంటి పథకాలకు కనుక కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో చోటు కల్పించి, జాతీయ స్థాయిలో అమలుచేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిని రైతులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. మరి మధ్యప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలకు కేంద్ర బడ్జెట్ లో చోటు కల్పిస్తుందో లేదో చూడాలి.