ఫోటో కోసం అలా కూర్చొని.. తిట్లు తింటోంది
- వివాదాస్పదంగా మారిన మహిళ ఫోటో
ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు... ఆ ప్రదేశాలను కెమేరాలో బంధించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. కొందరైతే.. వివిధ రకాల పోజుల్లో ఫోటోలు దిగి.. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. ఇలానే ఓ మహిళ.. ఫోటో కి పోజు ఇవ్వడానికి ఏకంగా బుద్ధుడి ఒడిలో కూర్చుంది. ఈ సంఘటన థాయిలాండ్ లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. థాయిలాండ్ లోని వాట్య యాయ్ చాయ్ మాంగ్ ఖాన్ అనే ఆలయం ఉంది. అందులో కొన్ని వేల సంఖ్యలో బుద్ధుని విగ్రహాలు ఉంటాయి. ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి కూడా చాలా ఎక్కువ. అయితే.. ఇటీవల స్పెయిన్ నుంచి ఓ యువతి ఇక్కడికి వచ్చింది. కాగా.. ఫోటో దిగేందుకు ఏకంగా బుద్ధుని ఒడిలో కూర్చుంది. కాగా.. దీనిని మరెవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
నోప్పొర్న్ చాంపిరామన్ అనే వ్యక్తి ఈ ఫోటోని ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు.ఈ ఫోటో అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలనే కారణంతోనే ఫేస్ బుక్ లో పోస్టు చేసినట్లు అతను తెలిపాడు. కాగా.. నెటిజన్లు మాత్రం ఆ విదేశీ మహిళలపై విమర్షల వర్షం కురిపిస్తున్నారు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో కూడా తెలిదా అంటూ మహిళపై తిట్ల దండకం కురిపించారు. కాగా.. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.