మద్యం మత్తులో యువతి ప్రాణాలను బలితీసుకున్న పోలీస్
ప్రజలకు రక్షణగా నిలిచి వారి ప్రాణాలను కాపాడాల్సిన పోలీసే ఓ యువతి మృతికి కారణమైన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో బైక్ పై వెళుతున్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో బైక్ ని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఓ యువతి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
విజయవాడ నగరంలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శ్రీన అనే వ్యక్తి నిన్న అర్థరాత్రి ఫుల్లుగా మందు కొట్టి బైక్ పై రోడ్డుమీదకు వచ్చాడు. ఇదే సమయంలో తేజస్విని అనే యువతి తన సోదరునితో కలిసి బైక్ పై వెళుతోంది. అయితే మత్తులో బైక్ నడుపుతున్న కానిస్టేబుల్ ఏలూరురోడ్డులో గల విజయటాకీస్ దగ్గరకకు రాగానే అదుపుతప్పి ఎదురుగా వస్తున్న వీరి బైక్ ను ఢీ కొట్టాడు. దీంతో తేజస్విని తో పాటు ఆమె సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ తేజస్విని బ్రెయిన్ డెడ్ కు గురైనట్లు వైద్యులు తెలిపారు. ఆమె సోదరుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు తేజస్విని చెన్నైలో ఓ సాప్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తుంది. ఇటీవలే తన స్వస్థలం విజయవాడు వచ్చింది. ఇంతలోనే ఇలా ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ కు గురవడంతో కుటుంబంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.