భారత్ నుంచి ట్రంప్ కి రాఖీలు
- రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని వీరంతా ట్రంప్ కి రాఖీలు పంపించారు
- తమ గ్రామానికి రావాలని ఆహ్వానం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి భారత్ నుంచి కొందరు మహిళలు రాఖీలు పంపించారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని వీరంతా ట్రంప్ కి రాఖీలు పంపించారు. వివరాల్లోకి వెళితే.. హర్యానా రష్ట్రంలోని మారుమూల ప్రాంతమైన మరోరా గ్రామానికి ఇటీవల సులభ్ ఇంటర్నేషనల్ చీఫ్ భిందేశ్వర్ పథక్ అనే ఎన్జీవో సంస్థ ‘ట్రంప్’ పేరిట నామకరణం చేశారు. ఈ గ్రామాన్ని సులభ్ ఇంటర్నేషనల్ దత్తత తీసుకుని అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అయితే భారత్, అమెరికా మధ్య సంబంధాలు మరింత బలపడాలంటూ ఇటీవల ఈ వూరి పేరును ట్రంప్ గ్రామం అని మార్చారు సులభ్ చీఫ్ బిందేశ్వర్. అయితే అనుమతులు లేకుండా గ్రామం పేరును మార్చడం చట్టవిరుద్ధమని.. వెంటనే ట్రంప్ పేరుతో ఉన్న హోర్డింగ్లో, బోర్డులు తీసేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో వాటిని తొలగించినప్పటికీ.. ట్రంప్ గ్రామమనే చెప్పుకుంటున్నారు అక్కడి ప్రజలు.
ఈ నేపథ్యంలోనే వారు ట్రంప్ చిత్ర పటంతో రాఖీలు తయారు చేసి దాదాపు వెయ్యి ఆయనకు పంపారు. కేవలం ట్రంప్ కోసమే కాకుండా భారత ప్రధాని నరేంద్రమోదీ కోసం కూడా 501 రాఖీలు తయారు చేశారు.
ట్రంప్, మోదీలను తమకు పెద్దన్నలుగా భావిస్తున్నామని.. వారిద్దరూ కలిసి తమ గ్రామానికి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాఖీలతోపాటు తమ గ్రామానికి వారిరువురినీ ఆహ్వానిస్తూ లేఖ రాసి దానిని కూడా పంపించారు.