రైతుల్ని కాదు, దివీస్ నే తరలించవచ్చుగదా
దివిస్ ల్యాబ్ కోసం రైతుల భూములను కాజేసే బదులు, ల్యాబ్ నే మరొక చోటికి తరలించవచ్చుగదా అంటోంది కాంగ్రెస్
దివీస్ ఫ్యాక్టరీ కోసం రైతులను తరలించడం కాకుండ రైతుల భూములకు దూరంగా ఫ్యాక్టరీని తరలించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నది. తూర్పుగోదావరి జిల్లా దానవాయిపేటలో దివీస్ ల్యాబ్స్ నిర్మాణాన్ని తక్షణం నిలిపివేయాలని రైతులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ మద్ధతు తెలిపింది. దివీస్ ను వ్యతిరేకిస్తున్న రైతాంగ పోరాటాన్ని సమర్థించడం అభివృద్ధిని అడ్డు కోవడమేనన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యలను పార్టీ ఖండించింది.
వందల ఎకరాల భూములను అప్పనంగా కొల్లగొట్టేందుకే టీడీపీ ప్రభుత్వం దివీస్ ల్యాబ్ ను తెరపైకి తెచ్చిందని, దానిని కాపాడేందుకు ప్రతిపక్షపార్టీల మీద నిందలు మోపుతున్నారని పార్టీ అధికార ప్రతినిది కొలనుకొండ శివాజీ వ్యాఖ్యనించారు.
’ఈ ఫ్యాక్టరీ వల్ల వేలాదిమంది మత్స్యకారులు, రైతులు ఉపాధి కోల్పోతారు. ప్రజల ఆరోగ్యానికి పెను ముప్పు వాటిల్లుతుంది. సముద్ర జలాలు కలుషితమవుతాయి.- అయినా మంత్రులు, అధికార పార్టీ నేతలు ఎటువంటి అపాయాలు ఉండబోవని బుకాయిస్తున్నారు,‘ అని శివాజీ విమర్శించారు.
ఈ ప్రాంతంలో 82 రోజులుగా 104 సెక్షన్ విధించి న విషయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్రంలో నడిచేది ప్రజాస్వామ్యం కాదు, పోలీస్ రాజ్యమని ఆయన అన్నారు. రాష్ట్రమంతాపాదయాత్రలు జరగుకుండా సెక్షన్ 30 ని అమలుచేస్తున్నవిషయాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. చట్టాలతో మానవ , ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని ఆయన విమర్శించారు.
బతుకు తెరువు కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న పేదలను, ఆందోళనకారులను నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. ఈ ఉద్యమం ఆగదని చెబుతూ దివీస్ ల్యాబ్ ను నివాసిత గ్రామాలకు దూరంగా తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ముఖ్యమంత్రి ని కోరారు.
ఈపోరాటానికి మద్ధతుగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్రాంతాన్నిసందర్శించి రైతులకు మద్ధతు తెలిపారు.