చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ ఏమిటో బుట్టా రేణుక చెప్పాలి
70 కోట్ల ప్యాకేజీ కోసం పార్టీ మారింది నిజమేనా?
వై ఎస్ ఆర్ సి గుర్తుపై గెలిచి ఏమి ఆశించి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ప్రజలకు చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి సూటిగా ప్రశ్నించారు.
రాజకీయంగా అనుభవం లేకపోయినా ఎంపీ టికెట్ ఇచ్చి బుట్టా రేణుకను గెలిపిస్తే, చివరకు ఈ ఫిరాయించి ప్రజాభిప్రాయాన్ని అవమానపర్చారని ఆయన విమర్శించారు. బుట్టారేణుక ప్యాకేజీకి అమ్ముడుపోయిందని అన్నారు.
ఆయన మంగళవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ ఆమెకు సుమారు రూ.70 కోట్ల ప్యాకేజీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోందని అన్నారు. దానికి ఆశపడే పార్టీ మారారా? అని ఆయన ప్రశ్నించారు.
‘ ఇలా ఎంపిలను ప్యాకేజీలతో కొనేసి నైతిక విలువలను చంద్రబాబు నాయుడు తుంగలోకి తొక్కారు. తన అవినీతి నుంచి చేతగాని తనం నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఈ కొనుగోళ్లు మళ్లీ మొదలుపెట్టారు. ఎందుకంటే నవంబర్ 2 నుంచి టిిడిపి అవినీతి పాలన మీద పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. అందుకే ఈ పార్టీ ఫిరాయింపు సృష్టించి ప్రజల దృష్టి మళ్లించాలనుకుంటున్నారు,’ అని పార్థసారధి అన్నారు.
ఆ పాదయాత్రలో టీడీపీ సర్కార్ చేస్తున్న అవినీతి, మోసాలు, అక్రమాలు, ప్రజలు ఏవిధంగా అన్యాయానికి గురవుతున్నారో ఇవన్నీ బట్టబయలు అవుతాయనే భయంతో ఈ ప్రక్రియను మళ్లీ మొదలుపెట్టారు. పశువులను కొంటున్నట్లు ఎమ్మెల్యేలు, ఎంపీలను కొంటున్నారు. సిగ్గులేకుండా కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు. వైఎస్ జగన్ మాత్రం నైతిక విలువలకు కట్టుబడి ఉన్నారు. రాజీనామా చేశాకే ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డిని వైఎస్ఆర్ సీపీలోకి చేర్చుకున్నారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలు, పాలనా వైఫల్యాలను పాదయాత్రలో వైఎస్ జగన్ ప్రజలకు వివరిస్తారు. మూడున్నరేళ్లలో చంద్రబాబు ఒక్క మంచి పని చేయలేదు. బలహీన వర్గాలకు చాలా హామీలిచ్చి మోసం చేశారు. బీసీల సంక్షేమంపై బహిరంగ చర్చకు మేం సిద్ధం. పీడీబ్ల్యూడీ గ్రౌండ్లో చర్చిద్దాం. తేదీ, సమయం మీరే నిర్ణయించండి.’ అని సవాల్ విసిరారు.