నోట్ల రద్దు: భారం కానున్న ఏడు కొండల వాడి దర్శనం
నోట్ల రద్దు వల్ల పడిపోయిన వెంకన్న రాబడి పూడ్చేందుకు చర్యలు
ఏడుకొండల వాడికి నోట్ల రద్దు దెబ్బ బాగా తగిలింది. స్వామి వారి ఆదాయం పడిపోయింది. అందువల్ల నోట్లరద్దు వచ్చిన కొరతను పూరించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం యోచిస్తున్నది. వచ్చే బోర్డుసమావేశంలోపు ప్రభుత్వం ఒకె చెబితే అన్ని సేవల రేట్లు పెరిగే అవకాశం కనిపిస్తున్నది.
బ్యాంక్ డిపాజిట్లపై వచ్చే వడ్డీలతో కలిపి స్వామి వారి ఆదాయం రు.5 కోట్ల వరకు వుండేది. హుండీల ద్వారా సమకూరే ఆదాయమే కాకుండా వివిధ సేవల టికెట్లు, ప్రసాదం అమ్మకాల రూపంలోనూ టీటీడీ ఖజానాకి భారీగా ఆదాయం ఉండేది.
మూన్నెళ్ల కిందట నోట్ల రద్దు అమలు కావడంతో స్వామి ఆదాయానికి బాగా గండిపడింది. దీనితో గత ఈ ఆదాయం రూ.1 కోటి నుంచి 2 కోట్ల మేర పడిపోయిందని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణ మూర్తి చెబుతున్నారు. కాబట్టి టిటిడి అందించే సేవల క్వాలిటీ ఏ మాత్రం పడిపోకుండా ఉండేందుకు సేవల టికెట్ల ధరలు పెంచాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు.
నిజానికి ఈ విషయం చాలా కాలంగా నానుతూ వస్తున్నదని, ఇపుడు నోట్ల రద్దు తర్వాత ఒక నిర్ణయం తీసుకునే సమయం అసన్నమయిందని ఆయన చెప్పారు.
ఈ నిర్ణయం తో అన్ని రకాల సేవల ధరలతోపాటు ప్రసాదాల ధరలు కూడా పెరుగుతాయి.
నిజానికి, గత ఏడాదేఈ విషయం నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నించారు. ధరలు పెంచే విషయం మీద టిటిడి ఒక సబ్ కమిటీని కూడా నియమించింది. ఈకమిటీ చేసిన సిఫార్సుల ప్రకారం ధరలు పెంచేందుకు బోర్డుకూడా సమావేశమయింది. అయితే, 2016 మార్చి సమావేశంలో నిర్ణయం తీసుకోలేక పోవడానికి కారణం చదలవాడ అధ్వర్యంలోని బోర్డు కాల పరిమితి అయిపోతూ ఉండటమే. గత మే నెలలో చదలవాడ కృష్ణమూర్తి పదవీకాలం చట్టం ప్రకారం రెండేళ్లుగా పొడిగించారు. ఎందుకంటే గతంలో ఆయనకు ఒక ఏడాదిమాత్రమే ఇచ్చారు.
వివిధ సేవల టికెట్ల ధరలు పెంచే విషయం పరిశీలనలో ఉందని చెప్పినా ఏ మేరకు పెంచాలనే విషయం ఆయన వెల్లడించ లేదు.
.
రూ.50 నుంచి 5,000 వరకు ఖరీదు చేసే సేవలను టిటిడి అందిస్తూ ఉంది. ప్రజలు సాధారణంగా రూ.300 వెచ్చించి స్పెషల్ దర్శనం టికెట్లు కొనుగోలు చేస్తుంటారు . రూ.500 వీఐపీ టికెట్ కొనుగోలు చేసి దర్శనం చేసుకునే వారు మరొక 2000 దాకా ఉంటారు. ఇవేకాకుండా ఇతర సేవలపై రూ.5 నుంచి రూ.10 మేర టికెట్ ధరలు పెంచి ఆదాయం పెంచేందుకు టిటిడి యోచిస్తున్నది.