పార్లమెంటు సమీపంలో వేశ్య గృహాలా..?
- వేశ్యగృహాలపై ఢిల్లీ మహిళా కమిషన్ కన్నెర్ర
- వేశ్యగృహ నిర్వాహకులకు సమన్లు
దేశరాజధాని ఢిల్లీలోని వేశ్యగృహాలపై మహిళా కమిషన్ కన్నెర్ర జేసింది. పార్లమెంటుకు 3కిలోమీటర్ల దూరంలో వ్యభిచార గృహాలు ఉండటంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మలివాల్ అధికారులను ఆదేశించారు.
ఢిల్లీలోని జీబీ రోడ్డులో ఉన్న 125 వేళ్య గృహాలను మూసివేయాల్సిందిగా ఢిల్లీ మహిళా కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు వేశ్య గృహాల నిర్వాహకులకు సమన్లు కూడా జారీ చేసింది. ఈ గృహాల నిర్వహణను పలు ప్రముఖ కంపెనీలు చేపడుతున్నాయని అధికారులకు సమాచారం అందింది. దీనిపై వారు ఆరా తీయగా.. పొంతనలేని సమాధాలు వచ్చాయి.
దీంతో.. దీనిపై అధికారులు చర్యలు చేపట్టారు. వేశ్య గృహాల నిజమైన యజమానులు ఎవరో తెలియజేయాలని.. వారి గుర్తింపు కార్డును సెప్టెంబర్ 24వ తేదీ లోపు మహిళాకమిషన్ సమర్పించాలని తెలిపారు. కొందరు నిర్వాహకులు సమన్లు తీసుకోవడానికి నిరాక రించడంతో వేశ్యాగృహాల గోడలకు వాటిని అంటించామని వారు పేర్కొన్నారు.
దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి మైనర్ బాలికలు, యువతులు, మహిళలను జీబీ రోడ్డులోని వేశ్యాగృహాలకు అక్రమంగా తరలించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని స్వాతి మలివాల్ ఈ సందర్భంగా ఆరోపించారు. కొన్ని సందర్భాల్లో అత్యాచారాలు కూడా ఈ వ్యభిచార గృహాల్లో జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నా రు. ఇప్పటివరకు ఎన్ని దాడులు జరిగినా ఇక్కడి వేశ్యాగృహాల నిజమైన యజమానులు బయట పడలేదని, కొందరు నిర్వాహకులను మాత్రం పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. పార్లమెంటుకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే వ్యభిచారం జరుగుతుండటం సిగ్గు చేటని, దీనిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు.