గిడ్డి ఈశ్వరి సంచలన వ్యాఖ్యలు
- సంచలనం రేపిన గిడ్డి ఈశ్వరి వ్యాఖ్యలు
- టీడీపీలో చేరిన ఈశ్వరి
- జగన్ తన ప్రాణమన్న ఈశ్వరి
పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఉదయం ఆమె టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. జగన్ అంటే తనకు ప్రాణమని చెప్పారు. మనసు చంపుకొని మరీ టీడీపీలో చేరానని ఆమె చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.
‘‘నాకు రాజకీయ భిక్ష పెట్టింది జగన్. ఓ గిరిజన మహిళ అయిన నేను ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యానంటే కారణం జగన్. అందుకే నాకు ఆయన ఇష్టం.. ప్రాణం. మనసు చంపుకొని ఇప్పుడు నేను టీడీపీలో చేరాను. విశాఖలో మొత్తం 15 నియోజకవర్గాల్లో ఉంటే.. గత ఎన్నికల్లో అరకు, పాడేరులో వైసీపీ అధిక మెజార్టీ సాధించింది. ప్రజలకు జగన్ కి మధ్య వారదిలాగా పనిచేశాను. జగన్ ని అమితంగా అభిమానించాను.. 2019 ఎన్నికల్లోనూ పాడేరు, అరకు మాత్రం కచ్చితంగా వైసీపీనే గెలుస్తుందని చెప్పగలను. అక్కడి ప్రజల్లో జగన్ పై నమ్మకం అంతలా పెరగడానికి నేను కారణమయ్యాను.
ఈ మధ్యకాలంలో జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు నచ్చలేదు. కోట్లు ఉంటేనే సీట్లు ఇస్తామని చెప్పారు. పార్టీకి ఉపయోగం లేని వాళ్లకు సీట్లు ఇస్తున్నారని.. పార్టీ కోసం కృషి చేసిన వాళ్లకు ఇవ్వడం లేదు ఇదే విషయంపై జగన్ తో మాట్లాడాను. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పాడేరులో గెలిపిస్తానని హామీ ఇచ్చాను. బతిమిలాడాను అయినా కూడా నిర్ధాక్షణ్యంగా నన్ను పార్టీ నుంచి బయటకు పంపించారు.’’ అంటూ ఈశ్వరి తన ఆవేదనను తెలియజేశారు.