ప్రజల హక్కుల పరిరక్షణకు కృషి.. సీతారం ఏచూరి
సీపీఎం జాతీయ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ఈ మహాసభలను మల్లు స్వరాజ్యం పార్టీ జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం అమరవీరులకు సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు, మహాసభ ప్రతినిధులు నివాళులర్పించారు. ఈ నెల 22 వరకు జాతీయ మహాసభలు జరగనున్నాయి. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ.. వామపక్షాల ఐక్యతకు, బలోపేతానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో మనం ఈ జాతీయ మహాసభలను జరుపుకుంటున్నామని తెలిపారు. దేశంలో అమానవీయ ఘటనలు అధికమై పోయాయని పేర్కొన్నారు. ఉన్నావ్, కతువా, సూరత్ ఘటనలు సిగ్గు చేటు అని అన్నారు. చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోవడం బాధాకరమన్నారు. దేశవ్యాప్తంగా ఏటీఎంలలో నగదు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. యువత అధికంగా ఉన్న భారత్లో నిరుద్యోగం పెరిగిపోతుందన్నారు. పెరుగుతున్న యువతకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు లభించట్లేదని చెప్పారు. ప్రజల హక్కుల పరిరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంటరీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం హామీలను విస్మరిస్తుందన్న ఏచూరి.. ప్రజలను మోసం చేస్తుందని ధ్వజమెత్తారు.