‘బీజేపీ ఎమ్మెల్యేలే మాతో టచ్ లో ఉన్నారు’
మా ఎమ్మెల్యేలంతా మాతోనే..
కర్ణాటక రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. శనివారం యడ్యురప్ప తన బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కాగా.. తమ ఎమ్మెల్యేను కాపాడుకునేందుకు ఇప్పటికే కాంగ్రెస్.. వారిని హైదరాబాద్ కి తరలించింది. దీంతో.. రేపు ఏం జరగబోతోందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు పరమేశ్వరన్, డీకే శివకుమార్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పారు. బలపరీక్ష జరిగేలోపు కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి జంప్ చేస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మిస్సయ్యారని వస్తున్న వార్తలను ఖండించారు. తమ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని చెప్పుకొచ్చారు.
ఇదే విషయంపై కాంగ్రెస్ నేత మధు యాష్కీ మాట్లాడుతూ.. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో ఉన్నారంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అవాస్తవమన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని స్పష్టం చేశారు. మెజార్టీ లేని బీజేపీ ఏవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు. మోదీ అప్రజాస్వామిక విధానాలను అన్ని పార్టీలు ప్రశ్నించాలని యాష్కీ అన్నారు.