కడుపునిండా తిని.. తర్వాతే దీక్షకు కూర్చున్నారు
కడుపునిండా తిని..ఆ తర్వాతే నిరాహార దీక్షకు కూర్చున్నారంటూ.. కాంగ్రెస్ నేతలపై భాజపా నేతలు ఆరోపించారు.నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు హయాంలో దేశంలో దళితులపై అకృత్యాలు పెరిగిపోయాయని, సామాజిక సామరస్యం దెబ్బతింటోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం ఒక రోజు నిరాహార దీక్షకు దిగారు. రాజ్భవన్లోని మహాత్మాగాంధీ సమాధికి నివాళులర్పించిన అనంతరం అక్కడే నిరాహార దీక్ష చేపట్టారు.
మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు తమ రాష్ట్రస్థాయిలో, జిల్లాస్థాయిలో నిరసన నిరాహార దీక్షలు కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరాహార దీక్షను కొనసాగిస్తున్నాయి. కాగా.. వీరి దీక్షలపై భాజపా నేతలు ఆరోపణలు చేశారు.
దీక్షకు కూర్చోడానికి ముందే కాంగ్రెస్ నేతలు అజయ్ మాకేన్, హరేన్ యూసఫ్, అరవింద్ సింగ్ లవ్లీలు ఢిల్లీలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ లో విందు చేశారని వారు ఆరోపిస్తున్నారు. వారు అలా విందు ఆరగిస్తున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలోవైరల్ అయ్యింది. వారు విందు చేస్తున్నప్పుడు అరవింద్ సింగ్ లవ్లీ ఏ రంగు షర్ట్ అయితే ధరించి ఉన్నారో.. దీక్ష కి కూర్చునేటప్పుడుకూడా అదే షర్ట్ ధరించి ఉన్నారు. దీంతో బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు నిజమేననే వాదనలు వినపడుతున్నాయి.