రేపు లేదా ఎల్లుండి చూడండి: బలనిరూపణపై యడ్యూరప్ప
రేపు లేదా ఎల్లుండి చూడండని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అన్నారు. శాసనసభలో బలనిరూపణపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఆ విధంగా అన్నారు.
బెంగళూరు: రేపు లేదా ఎల్లుండి చూడండని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అన్నారు. శాసనసభలో బలనిరూపణపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఆ విధంగా అన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన గురువారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
ఫలితాల అనంతరం పొత్తు పెట్టుకుని కాంగ్రెసు, జెడి(ఎస్) అనైతికంగా అధికారంలోకి రావాలని చూస్తున్నాయని ఆయన విమర్శించారు. తాను బలాన్ని నిరూపించుకోగలనని, తన ప్రభుత్వం ఐదేళ్లు ఉంటుందని ఆయన అన్నారు.
సతంత్ర అభ్యర్థులు తమను సంప్రదిస్తున్నారని, తమకు సంఖ్యాబలం సమకూరుతుందని బిజెపి ఎమ్మెల్యే బి. శ్రీరాములు అన్నారు.
బిజెపి ప్రభుత్వం ఎక్కువ కాలం నిలువదని, తమకు మెజారిటీ ఉందని, ఆ విశ్వాసంతో తాము ఉన్నామని, న్యాయం కోసం పోరాటం చేస్తామని, వందశాతం తమ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని కాంగ్రెసు నేత డికె శివకుమార్ అన్నారు.
యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంపై బిఎస్పీ నేత మాయావతి స్పందించారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని కుట్ర చేస్తున్నారని ఆమె అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్యంపై దాడి చేస్తోందని అన్నారు.