కడప జడ్పీ సమావేశం.. గరం..గరం..!
- వాడివేడిగా కడప జడ్పీటీసీ సమావేశం
- మంత్రి సోమిరెడ్డి, ఎమ్మెల్యే రాచమల్లు మధ్య వాగ్వివాదం
- ఆందోళనకు దిగిన ఎమ్మెల్యే రాచమల్లు
కడప జిల్లా పరిషత్ సమావేశం వాడివేడిగా సాగింది. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో సమావేశం రసాభాసగా మారింది.
అసలు విషయం ఏమిటంటే.. మంగళవారం కడప జిల్లా పరిషత్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జడ్పీటీసీ సభ్యులతోపాటు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు, మంత్రి సోమిరెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో భాగంగానే.. పేదలకు ఉచిత ఇళ్లు కట్టించాలని రాచమల్లు.. మంత్రిని కోరారు. ఈ విషయం అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోగలమంటూ సోమిరెడ్డి సమాధానం దాట వేశారు. దానికి అంగీకరించని రాచమల్లు.. వెంటనే నిర్ణయం చెప్పాలంటూ ఒత్తిడి చేశారు. ఈ విషయంలో మంత్రి, ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.ఇరు వర్గాల వారు.. ఎవరి వాదనను వారు వినిపించేందుకు ప్రయత్నించడంతో వివాదం తారా స్థాయికి చేరింది.
మంత్రి ప్రవర్తనకు నిరసనగా రాచమల్లు.. జడ్పీ కార్యాలయంలో కింద కూర్చున్నారు. రాచమల్లుతో పాటు మరికొందరు జడ్పీటీసీ సభ్యులు కూడా కింద కూర్చొని నిరసన తెలిపారు. వీరి ఆందోళనతో జడ్పీ సమావేశం రసాభాసగా మారింది. మంత్రి.. పేదలకు ఇళ్లు కట్టించే విషయంలో సరైన సమాధానం చెప్పే వరకు ఆందోళన విరమించనంటూ రాచమల్లు బీష్మించుకు కూర్చున్నారు. వివాదం కొనసాగుతోంది.