కొడుకుని చంపేసి తోట బంగ్లాలో పాతేసిన సినీ రచయిత
ఓ సినీ రచయిత తన కుమారుడిని చంపేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
చెన్నై: ఓ సినీ రచయిత తన కుమారుడిని చంపేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతను కుమారుడిని చంపి, శవాన్ని తోట బంగ్లా ఆవరణలో పాతిపెట్టాడు. పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు.
తమిళనాడులోని మదురై టోక్ నగర్ లోని ఎస్బీ కాలనికి చెందన సౌపా అలియాస్ సౌందరపాండియన్ (55) సినీ కథా రచయిత. భార్య లత పూర్ణం (50) కోవిల్ పట్టి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్. భార్యాభర్తలు 14 ఏళ్ల క్రితం విడిపోయారు.
వారి ఒకే ఒక కుమారుడు విపిన్ (27). కొద్ది రోజులు తండ్రి వద్ద, మరికొద్ది రోజులు తల్లి వద్ద ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 30వ తేదీ నుంచి విపిన్ కనిపించకుండా పోయాడు. దాంతో పూర్ణం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విలాసవంతమైన కారు విక్రయం విషయంలో విపిన్ తండ్రితో గొడవ పడినట్లు పోలీసులకు తెలిసింది. దాంతో వారు సౌపాపై నిఘా పెట్టారు. బుధవారం సాయంత్రం అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
విపిన్ కు తానే కారు కొనిచ్చానని, మత్తు పదార్థాలకు బానిసగా మారి డబ్బుల కోసం తనను వేధిస్తూ వచ్చాడని, కారును కూడా అమ్మేశాడని సౌపా చెప్పాడు. ఆ విషయంపై తమ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, ఆ గొడవలో తాను సుత్తితో దాడి చేయగా అతను మరణించాడని చెప్పాడు.
శవాన్ని దిండుకల్ సమీపంలోని తన తోట బంగ్లా ప్రాంగణానికి తీసుకుని వెల్లి అక్కడ పనిచేసే భూమి (40), గణేశన్ (42) సహాయంతో పూడ్చివేసినట్లు తెలిపాడు. దాంతో పోలీసులు సౌపాను, భూమిని, గణేశన్ ను అరెస్టు చేశారు.
సౌపా ఓ ప్రముఖ తమిళ పత్రికలో పనిచేస్తున్నారని, ఓ తమిళ శాటిలైట్ టీవీ న్యూస్ చానెల్ పాపులర్ టీవీ షోలు చేస్తున్నాడని తెలుస్తోంది. సీవలపేరి పాండి అనే సినిమాకు ఆయన కథను అందించాడు.