ఫ్లిప్ కార్ట్ పై చీటింగ్ కేసు
- ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకులపై చీటింగ్ కేసు
ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ పై చీటింగ్ కేసు నమోదైంది. బెంగళూరుకి చెందిన నవీన్ అనే వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని ఇందిరానగర్కు చెందిన నవీన్ ఓ చిన్న సాఫ్ట్వేర్ కంపెనీని నడుపుతున్నాడు. బిగ్ బిలియన్ సేల్లో భాగంగా నవీన్ ఫ్లిప్కార్ట్తో ఒప్పందం కుదుర్చుకుని 2015 నుంచి 2016 వరకు 14,000 ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు సరఫరా చేశాడు. కాగా వాటిలో 1482 వస్తువులను మాత్రం వెనక్కి ఇచ్చారని చెప్పారు. మిగిలిన ల్యాప్ టాప్ లు, ఇతర వస్తువులను వెనక్కి ఇవ్వనూలేదు, అలా అని డబ్బులు కూడా చెల్లించలేదని అతను ఆరోపించాడు. వాటికిసంబంధించిన టీడీఎస్, షిప్పింగ్ ఛార్జీలు కూడా చెల్లించలేదని వాపోయాడు. వీటి గురించి అడిగితే అన్ని వస్తువులు వెనక్కి ఇచ్చేశామని .. ఇక ఎలాంటి బాకీలు లేవని బన్సల్ సోదరులు వాదించినట్లు నవీన్ ఆరోపించాడు.
ఈ మేరకు ఇందిరానగర్ పోలీసులు బన్సల్ సోదరులపై చీటింగ్ కేసు నమోదు చేశారు. వీరితో పాటు ఫ్లిప్కార్ట్ సేల్స్ డైరెక్టర్, అకౌంట్ మేనేజర్లపైనా నవీన్ ఫిర్యాదు చేశాడు.