గుజరాత్ సీఎం రేసులో స్మృతీఇరానీ?
- గుజరాత్ లో విజయ ఢంకా మోగించిన బీజేపీ
- ఆరోసారి గుజరాత్ లో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ
గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ మరోసారి గెలుపు బావుటా ఎగుర వేసింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఆరోసారి గుజరాత్ ని బీజేపీ దక్కించుకుంది. దాదాపు 22ఏళ్లుగా ఆ రాష్ట్రాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న కేంద్రంలోని అధికార పార్టీ మరోసారి తన సత్తా చాటుకుంది. అలా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయో లేదో.. ఇప్పుడు తెరపై కొత్త ప్రశ్న వెలువడింది. అదే.. గుజరాత్ నెక్ట్స్ ముఖ్యమంత్రి ఎవరు అని?
ప్రస్తుతం విజయ్ రూపానీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తుండగా.. అతడిని రెండోసారి కంటిన్యూ చేసేందుకు బీజేపీ పెద్దగా ఆసక్తిని చూపడం లేదట. అందుకే అతడి స్థానంలో మంచి జనాధరణ పొందిన నేతను ఎంపిక చేయాలని భావిస్తున్నారట.
ఇందులో భాగంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పేరు బలంగా వినిపిస్తోంది. గుజరాతీలో బాగా మాట్లాడటంతో పాటు నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్న స్మృతిని సీఎం పీఠంపై కూర్చోబెడితే రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తుకు ఎదురుండదని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. స్మృతితో పాటు మన్సుఖ్ ఎల్ మాండవ్య, వాజుభాయ్ వాలా పేర్లు కూడా సీఎం రేసులో వినిపిస్తున్నాయి. మొత్తానికి నరేంద్రమోదీ ఇలాక అయిన గుజరాత్ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు వస్తారో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.