ఐపీఎల్ ఆఫర్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్
ఇప్పుడంతా ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. క్రికెట్ అభిమానులంతా.. ఐపీఎల్ మ్యాచులు చూసేందుకు టీవీలకు, ఫోన్లకుఅతుక్కుపోతోంటే.. దీనిని క్యాష్ చేసుకోవడానికి చూస్తున్నాయి టెలికాం ఆపరేటర్లు. ఇప్పటికే రిలయన్స్ జియో ఐపీఎల్ ఆఫర్ను ప్రకటించగా.. తాజాగా బీఎస్ఎన్ఎల్ కూడా అభిమానుల కోసం ఐపీఎల్ ఆఫర్ను తీసుకొచ్చింది.
రూ.248తో రీఛార్జి చేసుకుంటే 153జీబీ మొబైల్ డేటాను పొందే విధంగా ఆఫర్ను ప్రకటించింది. 51రోజుల పాటు ఈ ఆఫర్ పనిచేస్తుంది. ఈ ఆఫర్ కింద బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు 3జీబీ/రోజుకు పొందవచ్చు. ఐపీఎల్ ప్రసారాలను వీక్షించేందుకు అభిమానుల కోసం ప్రత్యేకంగా ఈ ఆఫర్ను తీసుకొచ్చినట్లు బీఎస్ఎన్ఎల్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈ రోజు నుంచి ఈ ఆఫర్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.
ఇక జియో బుధవారం ఐపీఎల్ అభిమానుల కోసం రూ.251 ఆఫర్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఆఫర్ కింద 102జీబీని పొందవచ్చు. ఇక భారతీ ఎయిర్టెల్ హాట్స్టార్ టీవీ యాప్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్లను ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం వీక్షించొచ్చని నిన్న ప్రకటించింది.