కొడుకు పెళ్లి పనులు చేస్తూ తండ్రి మృతి
హైదరాబాద్ లో ఓ పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. మరికొద్ది గంటల్లో కొడుకు పెళ్ళి ఉండగా పెళ్లి పనులు చేస్తున్న ఓ వ్యక్తి కరెంట్ షాక్ కు గురై చనిపోయాడు. దీంతో శుభకార్యం జరగాల్సిన ఇంట విషాద చాయలు అలుముకున్నాయి. ఈ దురఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.
హైదరాబాద్ వనస్థలి పురంలో నివాసముండే నర్సింహ(58) అనే వ్యక్తి కొడుకు పెళ్లి ఇవాళ మద్యాహ్నం జరగాల్సి ఉంది. ఈ పెండ్లి పనుల్లో భాగంగా తెల్లవారుజామున 5 గంటలకు నర్సింహ ఇంట్లో లైట్లు బిగిస్తుండగా ప్రమాదం జరిగింది. ఆతడు కొద్దిగా ఏమరపాటుతో కరెంట్ ప్రవహిస్తున్న వైరును తాకాడు. దీంతో కరెంట్ షాక్ కొట్టి నర్సింహ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీన్ని గమనించిన కుటుంబసభ్యులు నర్సింహను కామినేని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో ఆనందంగా పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.