‘‘ఆంధ్రజ్యోతి’’ పై బీజేపీ ఘరం ఘరం
ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి పై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మంగళవారం బీజేపీ నేతలు హైదరాబాద్ నగరంలోని ఆంధ్రజ్యోతి దినపత్రిక కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. కాగా.. పోలీసులు వారి అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతారణం నెలకొంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... మోదీ వ్యక్తిత్వం గురించి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు సి.నరసింహారావు రాసిన విశ్లేషణలు ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితవుతున్నాయి. ఈ కథనాలపై బీజేపీ మండిపడింది. హైదరాబాద్లోని ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రధాన కార్యాలయాన్ని బీజేపీ నేతలు, కార్యకర్తలు ముట్టడించేందుకు యత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి నిలువరించారు. బీజేపీ కార్యకర్తలు ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీపై కథనాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. బారికేడ్లను నెట్టుకుంటూ కార్యాలయం వైపు దూసుకొచ్చేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.