బిజెపి వ్యూహం: రేవణ్ణ ద్వారా కుమారస్వామికి ఎసరు?
కర్ణాటకలో అధికారాన్ని చేపట్టేందుకు బిజెపి పావులు కదుపుతోంది. జెడి(ఎస్) అధినేత దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణను దువ్వుతోంది.
బెంగళూరు: కర్ణాటకలో అధికారాన్ని చేపట్టేందుకు బిజెపి పావులు కదుపుతోంది. జెడి(ఎస్) అధినేత దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణను దువ్వుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలని బిజెపి జాతీయాధ్యక్షుడు పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు.
పార్టీ పరిశీలకులను కూడా ఆయన బెంగళూరుకు పంపించారు. ఇప్పటికే జెపి నడ్డా, జవదేకర్ బెంగళూరులో మకాం వేశారు. రేవణ్ణను తమ వైపు తిప్పుకోవడం ద్వారా అధికారాన్ని సొంతం చేసుకోవాలని బిజెపి చూస్తోంది. నలుగురు కేంద్ర మంత్రులు బెంగళూరు చేరుకున్నారు.
రేవణ్ణ వర్గానికి చెందినవారు 12 మంది శాసనసభ్యులున్నట్లు తెలుస్తోంది. రేవణ్ణకు డిప్యూటీ సిఎం పదవిని ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన వర్గానికి కొన్ని మంత్రి పదవులు కూడా ఇవ్వడానికి సిద్ధపడినట్లు సమాచారం. చీలికను అడ్డుకోవడానికి కుమారస్వామి ప్రయత్నాలు చేస్తున్నారు.
బిజెపి నేతలు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూ దేవెగౌడ నివాసానికి కూడా వెళ్లారు. కాగా, గవర్నర్ వాజుభాయ్ వాలా ఏం చేస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. రాజభవన్ కు వెళ్లిన కాంగ్రెసు నేతలకు ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.