అమ్మాయిలకు పరీక్ష ఫీజులు తగ్గింపు
ఇది నిజంగా అమ్మాయిలకు శుభవార్త. వివిధ పోటీ పరీక్షలకు దరఖాస్తులు చేసుకునే మహిళలకు పరీక్ష ఫీజులు తగ్గిస్తూ బిహార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ శుక్రవారం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన
మహిళలకు ఈ పరీక్ష ఫీజు రాయితీ వర్తిస్తుందని కేబినెట్ సెక్రటేరియట్ విభాగం ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ వెల్లడించారు. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(బీపీఎస్సీ), బిహార్ స్టాఫ్ సెలక్షన్ కమీషన్(బీఎస్ఎస్సీ) నిర్వహించే వివిధ పోటీ పరీక్షలకు మహిళలకు ఫీజు తగ్గింపు ఉంటుందని చెప్పారు.
ప్రిలిమినరీ పరీక్ష ఫీజు మహిళలకు రూ.600 నుంచి రూ.150కి తగ్గిస్తున్నట్లు తెలిపారు. అలాగే మెయిన్స్ పరీక్షకు రూ.750 నుంచి రూ.200కు తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే బిహార్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(బీఏఎస్) కేడర్ పునర్నిర్మాణానికి వివిధ పోస్టులు సృష్టించేందుకు కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. దీంతో బీఏఎస్లో పోస్టులు 1150 నుంచి 1634కు పెరుగుతున్నాయని చెప్పారు. డిప్యూటీ కలెక్టర్, సీనియర్ ప్యూటీ కలెక్టర్, అండర్ సెక్రటరీ,డిప్యూటీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ తదితర పోస్టులు మరిన్ని పెంచనున్నట్లు తెలిపారు. ఇలాంటి నిర్ణయం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తీసుకువస్తే బాగుంటుంది కదూ.