బెంగళూరు బార్ లో అగ్ని ప్రమాదం
- బెంగళూరులోని బార్ లో ఫైర్ యాక్సిడెంట్
- ఐదుగురు కార్మికుల సజీవ దహనం
కర్ణాటక రాజదాని బెంగళూరులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకురంది. కలాసిపాళ్యం లోని కైలాష్ బార్ ఆండ్ రెస్టారెంట్ లో ఇవాళ తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దీంతో బార్ లోనే పడుకున్న ఐదుగురు కార్మికులు మృతి చెందారు.
ఈ ప్రమాదానికి సంభందించిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకలోని తూముకురుకు చెందిన స్వామి,ప్రసాద్, మహేష్ లో పాటు హసన్ కు చెందిన మంజునాథ్, మాండ్యాకు చెందిన కీర్తిలు కైలాష్ బార్ ఆండ్ రెస్టారెంట్ లో పనిచేస్తున్నారు. వారంతా రోజూ బార్ లోనే పనిచేసి, రాత్రి సమయంలో అందులోనే పడుకుంటారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా వీరంతా అందులోనే పడుకున్నారు. అయితే అర్థరాత్రి 2 గంటల సమయంలో హటాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ సమయంలో వీరు గాఢ నిద్రలో ఉండటంతో మంటలనుండి తప్పించుకోలేక చనిపోయివుంటారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే విచారణ ప్రారంభించినట్లు బెంగళూరు వెస్ట్ జోన్ డీసీపీ అనుచేథ్ పేర్కొన్నారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పారు. అయితే వారు వచ్చేసరికే రెస్టారెంటులో తీవ్రంగా మంటలు అలుముకోవడంతో నిద్రిస్తున్న కార్మికులను కాపాడలేక పోయారు. వీరంతా పొట్టకూటి కోసం బెంగళూరుకు వలస వచ్చిన యువకులేనని అధికారులు తెలిపారు.