ఆంటీ గ్యాంగ్ ఆట కట్టు..!
- హునాన్విన్స్ షాంక్వి సిటీలో ‘ఆంటీ గ్యాంగ్’ పేరుతో ఒక ముఠా ఉండేది
- వీరు పాల్పడుతున్న చర్యలు చాలా పాశవికంగా ఉంటాయి
అప్పు తీసుకొని చెల్లించకపోతే.. మనదేశంలో ఎలాగైతే నానా రాద్దాంతం చేస్తారో.. చైనాలో కూడా అంతే. కాకపోతే.. మన కన్న వారు పాశవికంగా ప్రవర్తిస్తారు. ప్రత్యేకంగా ఇందుకోసం ముఠాలే ఉన్నాయంటే అర్థం చేసుకోండి. అలాంటి ముఠా ఒకదానిని ఇటీవల అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. అదే ఆంటీ గ్యాంగ్. మొండి బకాయిలను వసూలు చేయడంలో ఈ గ్యాంగ్ చేయరాని పనులు చేసింది. ఎట్టకేలకు పోలీసులు ఆ గ్యాంగ్ ఆట కట్టించారు.
వివరాల్లోకి వెళితే..
హునాన్ ప్రావిన్స్ షాంక్వి సిటీలో ‘ఆంటీ గ్యాంగ్’ పేరుతో ఒక ముఠా ఉండేది. ఈ ముఠాలో దాదాపు 30 మంది ఉంటారు. పదేళ్లుగా ఈ దందా కొనసాగిస్తున్న వీరి వయస్సు కూడా 50 ఏళ్లకు అటూఇటూగానే ఉంటుంది. బడా నిర్మాణ సంస్థలకు ఈ ముఠా అప్పులు వసూలు చేసి పెడుతుంది.
అప్పులు వసూలు చేసేందుకు వీరు పాల్పడుతున్న చర్యలు చాలా పాశవికంగా ఉంటాయి. అప్పు తీసుకొని తిరిగి చెప్పిన సమయానికి డబ్బు ఇవ్వని వారి ఇళ్ల వద్దకు వెళ్లి మైక్లు అందుకుని తిట్ల పురాణం మొదలెడతారు. లేకుంటే మొహంపై ఉమ్మేస్తారు. పని అయిందా సరే..కాకుంటే..? అప్పు తీసుకున్న వ్యక్తి మహిళ అయితే వాళ్ల దుస్తులు చించేస్తారు.అదే పురుషుడు అయితే తమ దుస్తులే చించేసుకుని అరిచి కేకలు పెడతారు. ఆ దెబ్బతో ఎంత మొండి బకాయి అయినా వసూలు కావాల్సిందే. అయితే, వీరి వ్యవహారం మితిమీరింది. వీరిపై ఫిర్యాదులు అందుకున్న అధికారులు వారిని ఇప్పుడు అరెస్టు చేశారు.
నేరం రుజువు కావటంతో ఆంటీగ్యాంగ్లోని 14 మందికి 11 ఏళ్ల వరకు జైలు శిక్షలు ఖరారయ్యాయి. రోజుకు 30 డాలర్లతో పాటు భోజనం ఫీజుగా తీసుకునే ఈ ముఠాలోని మహిళలు ఎటువంటి హింసాత్మక చర్యలకు పాల్పడలేదని పోలీసులు వివరించారు. ఈ ముఠా అధినేత్రి గవో యున్ ఒక అంధురాలు కావటం విశేషం.