థియేటర్ లో జనగణమనపై కొత్త ట్విస్ట్
జాతీయ గీతం ప్రదర్శనపై సుప్రీం మరో తీర్పు
సినిమా థియేటర్లలో జాతీయ గీతం ప్రదర్శించినప్పుడు ప్రేక్షకులు అంతా నిలబడాలని దేశమంతా ఇది వర్తిస్తుందని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అన్ని రాష్ట్రాలల్లోని థియేటర్లలో ఇప్పుడు ఈ తీర్పును అమలు చేస్తున్నారు.
అయితే పలు సందర్భాల్లో సుప్రీం తీర్పుపై గందరగోళం ఏర్పడుతోంది. థియేటర్లలో జాతీయ గీతం వినిపించిన ప్రతిసారీ ప్రేక్షకులు లేచి నిలబడాలా లేదంటే సినిమా ప్రదర్శనకు ముందు వచ్చే జాతీయ గీతం ప్రదర్శనప్పుడే నిలబడాలా... అనేది ఒక్కోసారి సమస్యగా మారుతోంది.
దీనిపై ఈ రోజు సుప్రీం స్పష్టతనిచ్చింది. సినిమా ప్రారంభానికి ముందు మాత్రమే జాతీయ గీతం వస్తున్నపుడు మాత్రమే గౌరవ సూచకంగా లేచి నిలబడాలని తన తీర్పులో పేర్కొంది.
సినిమా కథలో భాగంగా జాతీయ గీతం వస్తే లేచి నిలబడాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చింది.
సినిమా థియేటర్లలో జాతీయ గీతం తప్పని సరిచేస్తూ గత నవంబర్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో జాతీయగీతం వినిపిస్తుండగా లేచి నిలబడలేదంటూ పలు సందర్భాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ తరుణంలో సుప్రీం కోర్టు తాజాగా వెలువరించిన తీర్పు ఈ గందరగోళానికి తెర దించింది.