బడ్జెట్ హల్వా వేడుక మొదలైంది
- బడ్జెట్ హల్వా వేడుక ప్రారంభం
- అరుణ్ జైట్లీ సమక్షంలో హల్వా తయారీ
బడ్జెట్ హల్వా వేడుక మొదలైంది. 2017-18 సంవత్సర బడ్జెట్ పత్రాల ప్రింటింగ్ ని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రారంభించింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బడ్జెట్ ప్రతులను ప్రచురించడానికి ముందు హల్వా వేడుక చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ఆర్థికమంత్రిత్వశాఖ కార్యాలయంలోని నార్త్ బ్లాక్లో నిర్వహించారు.
ఈ వేడుక అనంతరం అధికారులు, సిబ్బంది అంతా బడ్జెట్ పత్రాల ముద్రణలో బిజీబిజీగా ఉంటారు. అప్పటి వరకు అధికారులెవరూ ఇళ్లకు వెళ్లడం ఉండదు. కుటుంబసభ్యులతో కూడా మాట్లాడే సదుపాయం ఉండదు. అత్యంత సీనియర్ అధికారులు మాత్రమే ఇళ్లకు వెళ్లే అవకాశాన్ని కల్పిస్తారు. దాదాపు ఆర్థికమంత్రిత్వ శాఖకు చెందిన దాదాపు 100 మంది అధికారులు ఈ హల్వా వేడుకలో పాల్గొన్నారు. ఓ పెద్ద కడాయిలో హల్వాను వండి.. ఉద్యోగులందరికీ పంచి పెట్టారు.
ఆర్థికశాఖ సెక్రటరీ అశోక్ లవస, రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్ అథియా, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు అధికారులు ఈ వేడుకలో పాల్గొన్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఫిబ్రవరి 1న బడ్జెట్ పత్రాలు లోక్సభకు తీసుకురావడం జరుగుతోంది. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెడతారు.