మంత్రి మాటల్లో అంతరార్థం తెలుసుకునేందుకు టీడీపీ, వైసీపీ నేతలు  ఎవరికి వారు చర్చలు జరుపుతున్నారు

ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యాలు.. ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపాయి. మంత్రి మాటల్లో అంతరార్థం తెలుసుకునేందుకు టీడీపీ, వైసీపీ నేతలు ఎవరికి వారు చర్చలు జరుపుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలకు హాజరైన మంత్రి అచ్చెన్నయుడు.. అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వైసీపీ ఎమ్మెల్యేల గురించి ప్రస్తావిస్తూ.. జగన్ పాదయాత్ర ముగిసే సమయానికి ఆ పార్టీలో కీలకనేతలు ఎవరూ లేకుండా చేస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు. ఒక కీలక నేత కోసం ఎదురు చూస్తున్నామని ఆయన కనుక టీడీపీలో చేరితే.. వైసీపీ ఖాళీ అయిపోయినట్టేనని ఆయన అన్నారు. వైసీపీలో ఇక జగన్..ఆయన తల్లి, చెల్లి మాత్రమే మిగులుతారని ఎద్దేవా చేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కనుక టీడీపీలో చేరితే.. వైసీపీ కి రాజ్యసభలో అభ్యర్థిని నిలిపే బలం కూడా ఉండదన్నారు. మంత్రి మాటలు వింటుంటే రానున్న ఎన్నికలను కీలక మలుపులు తిప్పే దిశగా టీడీపీ పథకం రచించిందని అర్థమౌతోంది.

కాగా.. ఇప్పుడు మంత్రి మాటలు సంచలనం రేపాయి. ఇప్పటికే 23మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. కాగా.. మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేల్లో టీడీపీ ఎదురు చూస్తున్న కీలక నేత ఎవరా అన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తింది.